మరో ముగ్గురు శాస్త్రవేత్తల బదిలీ
ABN , First Publish Date - 2021-07-25T05:47:25+05:30 IST
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని వైద్య కళాశాలకు బదలాయింపుపై హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం దండోపాయంకు పదును పెడుతోంది.
- నంద్యాల ఆర్ఏఆర్ఎస్పై సర్కారు కక్ష!
నంద్యాల, జూలై 24: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని వైద్య కళాశాలకు బదలాయింపుపై హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం దండోపాయంకు పదును పెడుతోంది. కోర్టుకు సర్కారు అనుకూల అఫిడవిట్ను కొత్తగా తయారుచేసి సమర్పించే విషయంలో ఇప్పటికే ఏడీఆర్, ఏవోపై బదిలీవేటు వేసిన సర్కారు తాజాగా శుక్రవారం రాత్రి ముగ్గురు శాస్త్ర వేత్తలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. నంద్యాలకు మంజూరైన వైద్యకళాశాల ఏర్పాటు కోసం పరిశోధనా స్థానానికి చెందిన 50 ఎకరాల భూమిని స్థానిక వైసీపీ ముఖ్య నాయ కుడు తన కనుసన్నల్లో కేటాయించడంపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తెరలేపుతోంది. వైద్య కళా శాలకు భూ కేటాయింపును వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్ర యించడం, కోర్టు స్టే విధించడంతోపాటు పరిశోధనాభూమిని కాకుండా ఇతర ప్రత్యామ్నాయ భూములను ఎందుకు పరిశీలించకూడదని జూన్ 17న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్ఏఆర్ఎస్ భూమిని ఎలాగైనా బదలాయించాలని వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరి స్తున్న నేపథ్యంలో జూన్ 25వ తేదీన ఏడీఆర్ మురళీకృష్ణను బదిలీ చేసింది. వెనువెంటనే 29వ తేదీన ఏవో సుబ్బారెడ్డిని కూడా బదిలీ చేసింది. తాజాగా చిరుధాన్యాల సీనియర్ సైంటిస్ట్ డా.సీవీ చంద్ర మోహన్రెడ్డిని అనంతపురం వ్యవసాయ పరిశోధనాకేంద్రానికి బదిలీ చేశారు. సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డా.ఎస్.బాలాజీనాయక్ను, క్రాప్ ఫిజియాలజీ శాస్త్రవేత్త టి. రాఘవేంద్రను తంగడంచెలో ఏర్పాటు చేయబోయే ఏఆర్ఎస్ (అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్)కు బదిలీచేస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.టి.గిరిధర్ కృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.