వణికిస్తున్న డెంగీ
ABN , First Publish Date - 2022-08-18T04:45:59+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలో డెంగీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
- రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 16 రోజుల్లో 32 కేసులు
గద్వాల క్రైం, ఆగస్టు 17 : జోగుళాంబ గద్వాల జిల్లాలో డెంగీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ నెలలో ఇప్పటి వరకు 34 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యులు చెప్తున్నారు. జూలైలో 10 మంది చిన్నారులు, తొమ్మిది మంది పెద్దలకు డెంగీ సోకినట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డుతో పాటు జనరల్ వార్డులో బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, కర్నూల్, హైదరాబాద్లలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
జ్వరం, విరేచనాలు, వాంతులతో సైతం ఇక్కట్లు
ఒక వైపు పెరుగుతున్న డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తుండగా, మరో వైపు జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డుకు ప్రతీ రోజు జ్వరంతో బాధపడుతున్న చిన్నారులు 15 మంది జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు 20 మంది, వాంతులు, విరేచనాల బారిన పడ్డ వారు 15 మంది వరకు వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. జనరల్ వార్డుకు కూడా ప్రతీ రోజు 20 నుంచి 30 వరకు జ్వరం కేసులు వస్తున్నాయి. వీరితో పాటు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు 20 మంది వరకు వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంతకు మించి బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
దోమల వల్లే డెంగీ వ్యాధి
శ్యామ్, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్యుడు, గద్వాల : డెంగీ వ్యాధి దోమల వల్లే వస్తుంది. ఇంటితో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. మురికికాలువను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంటి ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో నీరు నిల్వ చేసుకునే ట్యాంకులు, సంపులను శుభ్రం చేయించుకోవాలి.