లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి.. అనుమానంగా చూస్తుండడంతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-25T21:33:38+05:30 IST

లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్న చివరి అమ్మాయిని తానే కావాలంటూ సూసైడ్ నోట్

లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి.. అనుమానంగా చూస్తుండడంతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

తిరుచ్చి (తమిళనాడు): లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్న చివరి అమ్మాయిని తానే కావాలంటూ సూసైడ్ నోట్ రాసి గత వారం ఆత్మహత్య చేసుకున్న 12వ తరగతి బాలిక కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమ్మాయిని వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గణిత ఉపాధ్యాయుడు 42 ఏళ్ల శరవణన్ గత రాత్రి పొద్దుపోయాక తిరుచ్చిలోని తన మామగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.


బాధిత విద్యార్థిని తన ఆత్మహత్య లేఖలో ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ అందరూ తనను దోషిలా చూస్తున్నారని, విద్యార్థులు కూడా తనను అనుమానంగా చూస్తుండడం తనకు అవమానంగా ఉందని ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో శరవణన్ పేర్కొన్నారు. కాగా, బాలిక ఆత్మహత్య విషయంలో శరణన్‌పై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు నిర్ధారించడం గమనార్హం. 


ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ పలువురితో కంటతడి పెట్టించింది. తనకు ఈ భూమిపై ఇంకా నివసించాలనే ఉందని, ఇతరులకు సాయం చేస్తూ ముందుకు సాగాలనే ఉందని, కానీ త్వరలోనే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోతున్నానని పేర్కొంది. కరూర్ జిల్లాలో లైంగిక వేధింపులకు బలైన చివరి అమ్మాయిని తానే కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. తన ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పాలంటేనే భయమేస్తోందని పేర్కొంది. 


బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నశరవణన్‌ను కూడా విచారించారు. అయితే, అందరూ తననే దోషిగా చూస్తుండడంతో తట్టుకోలేకపోయిన శరవణన్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. 

Updated Date - 2021-11-25T21:33:38+05:30 IST