నాలుగున్నరేళ్ల బాలికపై ‘హత్యాచారం’.. వ్యక్తికి మరణశిక్ష విధించిన కోర్టు
ABN , First Publish Date - 2022-06-30T23:07:02+05:30 IST
నాలుగున్నరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై హత్య చేసిన వ్యక్తికి త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది
అగర్తల: నాలుగున్నరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై హత్య చేసిన వ్యక్తికి త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఖోవై జిల్లాలోని తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్ల బాలిక గతేడాది ఫిబ్రవరిలో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైంది. ఆరు రోజుల తర్వాత శరీరం నిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.
బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కాళీచరణ్ త్రిపురను అరెస్ట్ చేశారు. అతడిపై అత్యాచారం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ బిద్యేశ్వర్ సిన్హా తాజాగా నివేదికను, 35 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం నిందితుడు కాళీచరణ్ను దోషిగా నిర్ధారించిన కోర్టు మరణశిక్ష విధించింది. ఖోవై జిల్లా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.