టీఆర్ఎస్ కార్పొరేటర్ దౌర్జన్యం.. హెచ్చార్సీని ఆశ్రయించిన మహిళ

ABN , First Publish Date - 2020-07-14T16:14:46+05:30 IST

భూ వివాదంలో తలదూర్చడంపై ప్రశ్నించినందుకు అధికారపార్టీకి చెందిన..

టీఆర్ఎస్ కార్పొరేటర్ దౌర్జన్యం.. హెచ్చార్సీని ఆశ్రయించిన మహిళ

హైదరాబాద్: భూ వివాదంలో తలదూర్చడంపై ప్రశ్నించినందుకు అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్ తన భర్తపై దాడి చేశాడని ఓ మహిళ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లోని ద్వారకా నగర్‌లో ఆరేళ్ల క్రితం బ్యాంక్ ద్వారా కొన్న ఇంటిలో తనకు వాటా ఉందని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన కార్పొరేటర్ అనుచరులు తన భర్త పురందర్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా ఆ ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం పురేందర్ రెడ్డి బంజారహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నారని బాధిత మహిళ కమిషన్‌కు వివరించారు. 


ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు కార్పొరేటర్‌తో కుమ్మక్కయి తనపై కేసుపెట్టి వేధిస్తున్నారని ఆమె పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగి నాలుగు రోజులు గడిచినా కార్పొరేటర్, అతని అనుచరులపై కేసు నమోదు చేయలేదని ఆమె కమిషన్‌కు తెలిపారు. కార్పొరేటర్‌తో తన కుటుంబానికి హాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, కార్పొరేటర్, అతని అనుచరులు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చార్సీని కోరారు.

Updated Date - 2020-07-14T16:14:46+05:30 IST