ట్రక్కు గడ్డి @ 20 వేలు
ABN , First Publish Date - 2021-04-22T10:04:56+05:30 IST
డీజిల్ ధరలకు రెక్కలు రావడం, మరోవైపు వరి సాగుకు పెట్టుబడులు పెరగడంతో వీటి ప్రభావం గడ్డి ధరపై పడింది. గడ్డి ధరలు పెరగడంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా ..
- గతేడాది కంటే రూ.4 వేలు అధికం
- పెట్టుబడి పెరగడంతో ధర పెంచిన రైతులు
- రవాణా ఖర్చులపై డీజిల్ ధరల ప్రభావం
- పాడి రైతులకు భారమైన పశుపోషణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
డీజిల్ ధరలకు రెక్కలు రావడం, మరోవైపు వరి సాగుకు పెట్టుబడులు పెరగడంతో వీటి ప్రభావం గడ్డి ధరపై పడింది. గడ్డి ధరలు పెరగడంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. దూరాన్ని బట్టి ట్రక్కు గడ్డిని ఇంటికి చేర్చడానికి దాదాపు రూ.20 వేలు దాకా అవుతోంది. పశువుల మేతగా వాడే వరి గడ్డి ధరకు గిరాకీ అయింది. ఒక్కసారిగా ట్రక్కు గడ్డికి రూ.4వేలు వరకూ పెరిగింది. వరిసాగు చేసిన రైతులు ట్రక్కు గడ్డి రూ.12-15 వేలు చెబుతున్నారు. పశుపోషకులు గడ్డిని కొనుగోలు చేసి ఇంటికి తరలించడానికి దూరాన్ని బట్టి రవాణా ఖర్చులు మరో రూ.3-5వేలు దాకా అవుతున్నాయి.
ట్రక్కు వరి గడ్డి ఇంటికి చేరడానికి మొత్తం రూ.15 వేలు నుంచి రూ.20 వేలు దాకా వ్యయం అవుతోంది. గతేడాది ట్రక్కు గడ్డి రూ.10-13 వేలు వరకూ ఉండేది. రవాణా ఖర్చు కలిపి ఇంటికి చేరడానికి రూ.13-16 వేల వరకూ అయ్యేది. ఇటీవల వరుసగా డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీల రూపంలో నిరుటికంటే అదనంగా రూ.1000 భారం పడుతోంది. అలాగే వరిసాగుకు పెట్టుబడులు పెరిగాయని రైతులు గడ్డి ధరలు పెంచారు. దీంతో పశుపోషణకు పెట్టుబడి భారమవుతోందని పాడి రైతులు వాపోతున్నారు. కోస్తా జిల్లాల్లో వరిసాగు చేసిన రైతులు తమకు పాడి పశువులు లేకపోతే, గడ్డిని ట్రక్కుల లెక్కన అమ్మేస్తుంటారు. కాగా కూలీలు కోసిన గడ్డికి, యంత్రాలతో కోయించిన గడ్డికి చాలా తేడా ఉంటుంది. చేత్తో కోసిన గడ్డిని నాణ్యమైనదిగా పశుపోషకులు భావిస్తారు.