టీ-ట్వంటీ.. ఫుల్‌ సెక్యూరిటీ

ABN , First Publish Date - 2022-09-24T06:38:41+05:30 IST

స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరినీ జూమ్‌ చేసి చూసేలా..

టీ-ట్వంటీ.. ఫుల్‌ సెక్యూరిటీ
నిషేధిత వస్తువుల పట్టిక చూపిస్తున్న సీపీ

ఉప్పల్‌ స్టేడియంలో పటిష్ట బందోబస్తు

2500 మంది పోలీసులతో పహారా

300 సీసీ కెమెరాల ఏర్పాటు

చుట్టూ 15 కిలోమీటర్లు పరిధిలో ప్రత్యేక నిఘా

సెల్‌ఫోన్‌, ఇయర్‌ ఫోన్స్‌కు అనుమతి

హెల్మెట్స్‌, బ్యాగులు నిషేధం

నాలుగు గంటల నుంచే ఎంట్రీ

అర్ధరాత్రి ఒకటి వరకు మెట్రో పొడిగింపు

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 23(ఆంధ్రజ్యోతి): స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరినీ జూమ్‌ చేసి చూసేలా.. ఈ నెల 25న జరగనున్న టీ-20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ‘‘సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. సుమారు 40 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగానే 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆదివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం. ప్రేక్షకులను సాయంత్రం నాలుగు నుంచే స్టేడియంలోకి అనుమతిస్తాం. పార్కింగ్‌ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం’’ అని వివరించారు. 


వీటికి అనుమతిలేదు.. 

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్‌, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్లు, లైటర్స్‌, కాయిన్స్‌, హెల్మెట్స్‌, బయటి నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్‌ బాటిల్స్‌, ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, షార్ప్‌ మెటల్‌ వస్తువులు, వైరింగ్‌ పెన్స్‌, పర్ఫ్యూమ్స్‌ను స్టేడియం లోపలికి అనుమతించరు. ముందు జాగ్రత్తగా ఏడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. బ్లాక్‌ టికెట్స్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మ్యాచ్‌ రోజున అర్ధరాత్రి ఒంటి  గంట వరకు మెట్రో సేవలను పొడిగించారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌, సికింద్రాబాద్‌, తార్నాక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా స్నేక్‌ స్నాచర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. 


భద్రతా ఏర్పాట్లు ఇలా..

ఉప్పల్‌ స్టేడియం నుంచి చుట్టుపక్కల 15 కిలోమీటర్ల మేర సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 300 సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఐటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారు. కమాండ్‌ కంట్రోల్‌తో పాటు, బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-12లో ఉన్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి భద్రతా ఏరాట్లు పర్యవేక్షిస్తారు. స్టేడియం బయట నుంచి లోపలికి వెళ్లి కూర్చొనే సీటు వరకు జూమ్‌ చేసి పర్యవేక్షించే అత్యాధునిక కెమెరాలు వినియోగిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. స్టేడియం వద్ద ఎవరికైనా ఇబ్బందులు కలిగితే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్‌ సిబ్బందితో పాటు, డయల్‌-100, రాచకొండ వాట్సాప్‌ నంబర్‌ 9490617111కు ఫిర్యాదు చేయవచ్చు. 

ఎవరైనా డ్రోన్‌ కెమెరాల ద్వారా భద్రతను, స్టేడియం మొత్తాన్ని పర్యవేక్షించే అనుభవం ఉన్న ఏజెన్సీలు ముందుకు వస్తే  ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామన్నారు.


వారి కంటే పోలీసులే ఎక్కువ.. 

బోయిన్‌పల్లి. సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి జింఖానా గ్రౌండ్‌లో శుక్రవారం టికెట్లు పంపిణీ చేశారు. గురువారం ఏర్పడ్డ ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేశారు. టికెట్ల కోసం వచ్చిన వారి కంటే, పోలీసులే అధిక సంఖ్యలో కనిపించారు. అడిషనల్‌ సీపీ చౌహన్‌తో పాటు, జాయింట్‌ సీపీ కార్తికేయ, నార్త్‌జోన్‌ డీసీపీ చందనా దీప్తి, అడిషనల్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్‌ డీసీపీ రాధా కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T06:38:41+05:30 IST