కంపోస్టు యార్డు నిర్మిస్తే ఊరుకోం
ABN , First Publish Date - 2021-01-25T06:01:03+05:30 IST
భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన కంపోస్టు యార్డు తమ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయవద్దంటూ తుమ్మగొప్పు గ్రామానికి చెందిన దళితులు ఆదివారం డంపింగ్ యార్డు ప్రతిపాదిత భూముల వద్దకు వెళ్ళి ధర్నా చేశారు.
తుమ్మగొప్పు గ్రామస్థుల ధర్నా
భీమవరం, జనవరి 24: భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన కంపోస్టు యార్డు తమ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయవద్దంటూ తుమ్మగొప్పు గ్రామానికి చెందిన దళితులు ఆదివారం డంపింగ్ యార్డు ప్రతిపాదిత భూముల వద్దకు వెళ్ళి ధర్నా చేశారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామ పంచాయతీ శివారున గల తుమ్మగొప్పు గ్రామానికి అతి చేరువులో 38 ఎకరాలలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ భూములకు సంబంధించి గ్రామానికి చెందిన డి–పట్టా యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. తమ గ్రామ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్మిస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తే తామంతా అనారోగ్యానికి గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఈ ప్రాంతంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేయకుండా చూ డాలని కోరారు. అధికారులు స్పందించి జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డు తరలించకుంటే నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరించారు.