తుంగభద్రకు వరద
ABN , First Publish Date - 2022-07-07T05:12:59+05:30 IST
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయంలో నీటి మట్టం 53 టీఎంసీలకు చేరింది.
హాలహర్వి, జూలై 6: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయంలో నీటి మట్టం 53 టీఎంసీలకు చేరింది. వారం రోజుల క్రితం జరిగిన కర్ణాటక బోర్డు అధికారుల సమావేశంలో ఈ ఏడాది 150 టీఎంసీలు వరద నీరు వస్తుందని అంచనా వేశారు. ఈ నెల 15వ తేదీన ఎల్లెల్సీకి సాగునీరు విడుదల చేయాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో వరద ఉధృతి పెరగడంతో రైతులు పత్తి, మిరప, వరి పంటలు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. బుధవారం ఎగువ ప్రాంతాలైన ఆగుంబే, మలేనాడు, హరిహర, శివమొగ్గలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి 48,803 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు ఉండగా ప్రస్తుతం 1616.87 అడుగులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు ఉండగా ప్రస్తుత 52.989 టీఎంసీలు ఉంది. ఇనఫ్లో 48803 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 256 క్యూసెక్కులుగా ఉంది.