తుంగతుర్తి ఆస్పత్రిని కొవిడ్ చికిత్సకు వినియోగిస్తాం
ABN , First Publish Date - 2021-05-09T06:09:25+05:30 IST
తుంగతుర్తి ఆసుపత్రిని ఆరు ఆక్సిజన్ పడకలతో కొవిడ్ చికిత్సా కేంద్రంగా మారుస్తామని సూర్యాపేట జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు.
తుంగతుర్తి, మే 8: తుంగతుర్తి ఆసుపత్రిని ఆరు ఆక్సిజన్ పడకలతో కొవిడ్ చికిత్సా కేంద్రంగా మారుస్తామని సూర్యాపేట జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలో 681 బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయన్నారు. సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, మందులు అందజేస్తున్నామన్నారు. ఈ నెల 7వతేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్ష మందిని సర్వే చేసి 3,622 మందికి సాధారణ లక్షణాలు గుర్తించి మందుల కిట్లు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరించి కరోనా వ్యాప్తికి కృషిచేయాలని అన్నారు. ఆయన వెంట డాక్టర్ నిర్మల్ కుమార్, మోహన్, వీణ, దేశ్యా, దేవేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
1,313 మందికి కొవిడ్ లక్షణాలు : యాదాద్రి డీఎంహెచ్వో సాంబశివరావు
భువనగిరి రూరల్, మే 8: యాదాద్రి జిల్లా వ్యాప్తంగా శనివారం 1,313 మందికి కొవిడ్ లక్షణాలు గుర్తించినట్టు డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు తెలిపారు. కరోనా వైరస్ కట్టడికి జిల్లా వ్యాప్తంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారన్నారు. 48,689 ఇళ్లను సందర్శించి ఆరోగ్య వివరాలు సేకరించారని, ఇప్పటి వరకు 1,627 మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.