కశ్మీర్లో టీవీ నటి కాల్చివేత
ABN , First Publish Date - 2022-05-26T08:38:23+05:30 IST
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మారణకాండ కొనసాగిస్తున్నారు. ఓ పోలీసు కానిస్టేబుల్ను అతని ఏడేళ్ల కూతురు కళ్ల ఎదుటే కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి ఘాతుకానికే పాల్పడ్డారు.
బారాముల్లాలో ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మారణకాండ కొనసాగిస్తున్నారు. ఓ పోలీసు కానిస్టేబుల్ను అతని ఏడేళ్ల కూతురు కళ్ల ఎదుటే కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి ఘాతుకానికే పాల్పడ్డారు. పదేళ్ల వయస్సు ఉన్న తన మేనల్లుడితో కలిసి ఇంటి బయట ఉన్న ఓ టీవీ నటిపై కాల్పులకు తెగబడ్డారు. బడ్గామ్ జిల్లా చదూర ప్రాంతంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగిన ఘటనలో అమ్రీన్ భట్ అనే టీవీ నటి మరణించగా, తీవ్ర గాయాలపాలైన ఫర్హాన్ జుబైర్(10) అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడకు అయిన బుల్లెట్ గాయం వల్ల అమ్రీన్ ఆస్ప్రతికి వచ్చే దారిలోనే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఇక, అమ్రీన్ మేనల్లుడు ఫర్హాన్ చేతికి బుల్లెట్ గాయమవ్వగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా, జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మరణించారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా వీర మరణం పొందారు. బారాముల్లా జిల్లాలోని క్రీరీ ప్రాంతం నజీభట్ క్రాసింగ్లోని ఓ చెక్పోస్టు వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది.