Iraq దేశంలో మెరుపు వరదలు...12 మంది మృతి
ABN , First Publish Date - 2021-12-18T12:52:16+05:30 IST
ఇరాక్ దేశంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో 12 మంది మరణించారు....
అర్బిల్ (ఇరాక్): ఇరాక్ దేశంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో 12 మంది మరణించారు. స్వయం ప్రతిపత్తి కల కుర్దిస్తాన్ ప్రాంత రాజధాని అర్బిల్లో కుండపోత వర్షాల తర్వాత వరదలు ముంచెత్తడంతో ముగ్గురు విదేశీయులతో సహా 12 మంది మరణించారని ఇరాక్ అధికారి తెలిపారు.తీవ్రమైన కరవుతో అల్లాడిన ఇరాక్ దేశంలో భారీవర్షాలు కురిసి ప్రజల ఇళ్లలోకి వరద నీరు రావడంతో చాలామంది ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.మరణించిన 12 మందిలో 10 నెలల పాప, టర్కీ దేశీయులు, ఇద్దరు ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నారని ప్రావిన్షియల్ గవర్నర్ ఒమిద్ ఖోష్నావ్ తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకే వరదలు వెల్లువెత్తాయి. వరదనీటిలో వారి వాహనం కొట్టుకు పోవడంతో నలుగురు అత్యవసర సేవల సిబ్బంది గాయపడ్డారు.
మృతుల్లో ఒకరు పిడుగుపాటుకు గురై చనిపోయారని, మిగిలిన వారు ఇళ్లలోనే మునిగిపోయారని అత్యవసర సేవల ప్రతినిధి సర్కావ్ట్ కరాచ్ తెలిపారు.వరదల వల్ల పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, కొన్ని కుటుంబాలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందని కరాచ్ చెప్పారు.వరదనీటిలో బస్సులు, ట్రక్కులు, ట్యాంకర్ ట్రక్కులు కొట్టుకుపోయాయి.ఖోష్నావ్ నివాసితులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు.