orange alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు...22 మంది మృతి
ABN , First Publish Date - 2022-09-17T16:17:00+05:30 IST
దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు(heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ)(India Meteorological Department (IMD) వెల్లడించింది....
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు(heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ)(India Meteorological Department (IMD) వెల్లడించింది. ఐఎండీ తాజా వెదర్ రిపోర్టును శనివారం ఉదయం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో భారీవర్షాల వల్ల(rain-related incidents) గోడలు కూలి, ఇళ్లు దెబ్బతిని 22 మంది మరణించారు. మహారాష్ట్రలో శనివారం భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
భారీవర్షాల వల్ల లక్నో నగరంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో 9 మంది కూలీలు సజీవ సమాధి అయ్యారు.భారీవర్షాల వల్ల యూపీలోని ఉన్నవ్ నగరంలో ఐదుగురు, ఫతేపూర్ లో ముగ్గురు, సీతాపూర్, రాయబరేలీ, ఝాన్సీ నగరాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.భారీవర్షాల వల్ల తీవ్రంగా గాయపడిన వారిని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆసుపత్రికి తరలించామని జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ చెప్పారు. యూపీలో మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
చందౌలీ, వారాణసీ, ఘాజీపూర్, బలియా, లక్నో, అమేథీ, రాంపూర్, షాజహాన్ పూర్ ప్రాంతాల్లో శనివారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్(yellow alert) జారీ చేశారు. లక్నో నగరంలో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. మహారాష్ట్రలోని పాల్ఘార్, ముంబయి, థానే నగరాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శనివారం నాడు ఆరంజ్ అలర్ట్(orange alert) జారీ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోనూ ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.