ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్పై ట్రోలింగ్.. 11 ఏళ్ల నాటి ట్వీట్ తవ్వితీసి మరీ..
ABN , First Publish Date - 2021-11-30T22:31:10+05:30 IST
ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పగ్గాలు చేపట్టి 24 గంటలైనా పూర్తికాకముందే ఆయన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పగ్గాలు చేపట్టి 24 గంటలైనా పూర్తికాకముందే ఆయన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడో దశాబ్దం క్రితం ఆయన చేసిన ట్వీటే ఇందుకు కారణం. నాటి ట్వీట్ను తవ్వితీసిన నెటిజన్లు ఇప్పుడు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ట్విటర్ కొత్త సీఈఓ ద్వంద్వ వైఖరి బైటపడిందని కొందరు విరుచుకుపడుతుంటే మరికొందరు మాత్రం.. ఆయన ట్వీట్లో ‘శ్వేతజాతీ వారందరూ జాత్యాహంకారులు’ అనే భావన వ్యక్తమవుతోందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు కూడా పరాగ్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ట్విటర్లోనూ వివక్ష కాలుపెట్టనుందా..? అంటూ ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇలా అనూహ్య కాంట్రవర్శీకి దారి తీసిన ఆ ట్వీట్ దాదాపు 11 ఏళ్ల నాటిది. అప్పటికి పరాగ్ ట్వీటర్లో చేరలేదని కూడా సమాచారం. ‘‘ముస్లింలకు, తీవ్రవాదులకు మధ్య వ్యత్యాసాన్ని వారు గుర్తించకపోతే.. తెల్లవాళ్లకూ జాత్యాహంకారులకు మధ్య ఉన్న తేడాను నేను కూడా పట్టించుకోను’’ అంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి అది ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అప్పట్లో ప్రసారమైన ఓ టీవీ షోలోని ఓ డైలాగ్ను ఆయన అలా ట్వీటర్లో షేర్ చేశారు. ఆ వెంటనే మరో ట్వీట్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ టీవీషోలోని డైలాగ్ని ప్రస్తావించానని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఇవేమీ పట్టించుకోని నెటిజన్లు ట్విటర్ సీఈఓనే ట్రోల్ చేసి పారేశారు.