Internetను కుదిపేస్తున్న ముంబై బీచ్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు.. వీడియో ఇదే!
ABN , First Publish Date - 2022-07-20T00:23:54+05:30 IST
ఎన్నో హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు, సూచనలిస్తూ పోస్టులు, నిబంధనలు.. ముంబై ప్రజలను ఇవేవీ అడ్డుకోలేకపోయాయి. హెచ్చరికలు,
ముంబై: ఎన్నో హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు, సూచనలిస్తూ పోస్టులు, నిబంధనలు.. ముంబై ప్రజలను ఇవేవీ అడ్డుకోలేకపోయాయి. హెచ్చరికలు, సూచనలను బేఖాతరు చేస్తూ ముంబై (Mumbai) వాసులు సముద్రంలోకి చెత్తను విసిరేస్తూనే ఉన్నారు. సముద్ర తీరం మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగతిరుగుతోంది.
‘ముంబై మ్యాటర్స్’ (MumbaiMatterz) అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో మహీమ్ బీచ్(Mahim beach) మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో అడుగు వేసేందుకు కూడా ఖాళీ లేనంతగా నిండిపోయిది. ఆ చెత్తాచెదారం మధ్యనే ప్రజలు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరికొందరు బీచ్లో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పోస్టుకు ‘ ముంబైలోని బీచ్లో ఇప్పుడు తెరుచుకున్నాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే రిటర్న్ గిఫ్ట్లు చూసేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు’’ అని క్యాప్షన్ తగిలించారు.
ఈ పోస్టును ఇప్పటికే 97 వేలమందికిపైగా వీక్షించారు. ఈ క్లిప్పై నెటిజన్లు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. ‘భగవంతుడా! అందరూ చనిపోతారు. కానీ ఈ భూమిపై ప్లాస్టిక్కు మాత్రం చావులేదు’ అని ఓ యూజర్ ఆందోళన వ్యక్తం చేస్తే.. ‘ప్రకృతి తొలుత మనల్ని హెచ్చరిస్తుంది. అయినా ఫలితం లేకుంటే అది స్పందిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే దానిని మనం తట్టుకోలేం’ అని మరో యూజర్ రియాక్టయ్యాడు. సముద్రం చెత్తను తనలో ఉంచుకోదని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. చెత్తాచెదారంతో నిండిన బీచ్ ఫొటోలు, శుభ్రం చేసిన తర్వాతి ఫొటోలను షేర్ చేసింది.