ఎంపీని మోసం చేయబోయిన ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-21T07:05:26+05:30 IST

తాడేపల్లి సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తిని మోసగించడానికి యత్నించిన ఇద్దరిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు.

ఎంపీని మోసం చేయబోయిన ఇద్దరి అరెస్టు
మీడియాకు వివరాలు తెలియజేస్తున్న ఏఎస్పీ సుప్రజ

రాజకీయ నేతలు, ప్రముఖులే టార్గెట్‌ 

ఇప్పటి వరకు కాజేసింది రూ.70-80లక్షలు  

నిందితులపై 50కి పైగా చీటింగ్‌ కేసులు 


తిరుపతి (నేరవిభాగం), జనవరి 20: తాడేపల్లి సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తిని మోసగించడానికి యత్నించిన ఇద్దరిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్‌ ఏఎస్పీ సుప్రజ గురువారం వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈనెల 14వ తేదీన ఎంపీకి ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి తన పేరు అభిషేక్‌ అని, తాడేపల్లి సీఎంవో కార్యాలయంలోని పరిశ్రమల శాఖ ఉద్యోగిగా చెప్పుకున్నారు. గ్రామీణ పరిశ్రమల ఏర్పాటుకుగాను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పరిశ్రమలశాఖ రూ.ఐదు కోట్లను మంజూరు చేసిందని, 20 మంది దరఖాస్తుదారులకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున రుణం మంజూరైందన్నారు. అయితే 20 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల చొప్పున ముందుగా తన బ్యాంక్‌ అకౌంట్‌కు నగదు పంపించాలని సూచించారు. నగదు బదిలీ పూర్తయ్యాక రుణం మంజూరుకు సంబంధించిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ పంపిస్తామని చెప్పారు. ఆ తర్వాత అభిషేక్‌ పదేపదే కాల్‌ చేయడంతో ఎంపీకి అనుమానం వచ్చింది. సీఎంవో కార్యాలయంలోని పరిశ్రమలశాఖ కార్యాలయంలో వాకబు చేయగా అభిషేక్‌ పేరున ఎవ్వరూ అక్కడ పనిచేయడం లేదని తెలిసింది. దాంతో ఎంపీ పీఏ ఎస్‌.హరీష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీనాయుడు(40), శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభిషేక్‌(22) ఇద్దరూ కలిసి ఎంపీని మోసం చేసేందుకు ప్రయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం నిందితులు స్థానిక రుయాస్పత్రి వద్ద ఉన్నట్టు సమాచారం అందడంతో అలిపిరి ఎస్‌ఐ జయచంద్ర, సిబ్బందితో కలిసి సీఐ దేవేంద్రకుమార్‌ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూడగానే పారిపోబోయిన నిందితులను వెంటాడి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. 


బాలాజీనాయుడు గతంలో ఎన్టీపీసీ ఉద్యోగి 

నిందితుల్లో ఒకరైన బాలాజీనాయుడు అలియాస్‌ నాయుడు గతంలో ఎన్టీపీసీ ఉద్యోగిగా ఉండేవాడని, ఆర్థిక నేరాలకు పాల్పడటంతో ప్రభుత్వం విధులనుంచి తొలగించినట్టు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఆ తర్వాత బాలాజీనాయుడు.. దస్తగిరి, మనోహర్‌, లక్ష్మణ్‌, మహేష్‌ అనే మారు పేర్లతో వ్యవహరిస్తూ 2009 నుంచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడు. బాలాజీనాయుడు, అభిషేక్‌ కలిసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను టార్గెట్‌ చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. సుమారు రూ.70-80 లక్షల వరకు ప్రముఖుల నుంచి కాజేశారు. వీరిపై 50కిపైగా చీటింగ్‌ కేసులున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల శాఖలకు విడుదలచేసే నిధుల వివరాల ఆధారంగా వీరు మోసాలకు పాల్పడుతున్నారు. 2017లోనూ తిరుపతికి చెందిన ఓ ప్రముఖ నాయకురాలిని మోసం చేసేందుకు యత్నించిన కేసులో బాలాజీనాయుడిపై కేసు నమోదైంది. అప్పట్లో అతడిని హైదరాబాద్‌ పోలీసులనుంచి అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.బాలాజీనాయుడు ఎన్టీపీసీ ఉద్యోగిగా ఉన్నపుడు రూ.20వేలను లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.దీని వెనుక విశాఖ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పీఏ ఉన్నట్టు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ప్రజాప్రతిధులనే టార్గెట్‌ చేసుకుని.. వారినే మోసగించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. 

Updated Date - 2022-01-21T07:05:26+05:30 IST