రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించిన ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2020-08-09T10:17:57+05:30 IST
నకిలీ ఆస్తిపన్ను పత్రాలతో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఇళ్ల స్థలాలు పొందిన వారితో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని ..
విశాఖపట్నం, ఆగస్టు 8: నకిలీ ఆస్తిపన్ను పత్రాలతో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఇళ్ల స్థలాలు పొందిన వారితో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని అరెస్టు చేసి భీమిలి కోర్టులో హాజరు పరచినట్టు పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం... మధురవాడ సర్వే నంబర్-388 వికలాంగుల కాలనీలో మల్లెల విజయకుమార్, గంటా లక్ష్మణరావులు తమ్మినేని రమణ అనే వ్యక్తి ద్వారా ఒక్కొక్కరు 89 గజాల స్థలం సొంతం చేసుకోడానికి పథకం పన్నారు. ఆ స్థలంలో అప్పటికే వారుంటున్నట్టు, జీవీఎంసీకి ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు.
వీరిపై గతనెల 31న విశాఖ గ్రామీణ మండల తహసీల్దార్ ఆర్.నరసింహమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా చేపట్టగా వికలాంగుల కాలనీలోని 132, 134 ప్లాట్ నంబర్లలో 2014 నుంచి వీరు నివాసం ఉంటున్నట్టు రెవెన్యూ అధికారులను నమ్మించి గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు క్రమబధ్ధీకరించు కున్నట్టు రుజువవ్వడంతో విజయకుమార్ను, రమణలను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు సీఐ తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు తమ్మినేని రమణ అప్పట్లో భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా పనిచేసిన చిక్కాల విజయబాబు (నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు) దగ్గర కారు డ్రైవర్ కావడం గమనార్హం.