Uttar Pradesh: సాయంత్రం 5 గంటల నుంచి.. అర్ధరాత్రి 12 వరకు.. ఆ ఆరుగురు నిందితులు ఏమేం చేశారంటే..
ABN , First Publish Date - 2022-09-16T21:41:30+05:30 IST
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని లఖింపూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని లఖింపూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతులు కోసి చంపేశారు. వారి మృతదేహాలను చెట్టుకు వేళాడదీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించిన అధికారులు 15 గంటల్లోనే మొత్తం ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
బుధవారం సాయంత్రం 4 గంటలకు బాధిత బాలికల ఇంటికి జునైద్, సుహైల్, హఫీజుర్ చేరుకున్నారు. బాలికలిద్దరినీ వారు ప్రలోభపెట్టి తమతో పాటు బయటకు తీసుకెళ్లారు. ఊరి బయట పొలంలో జునైద్, సుహైల్ ఆ ఇద్దరు బాలికలతో శృంగారం సాగించారు. అనంతరం పెళ్లి గురించి ఆ బాలికలిద్దరూ జునైద్, సుహైల్ను నిలదీశారు. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చేసుకుంది. దీంతో జునైద్, సుహైల్, హఫీజుర్లు ఆ ఇద్దరు బాలికలను గొంతులు కోసి చంపేశారు. అనంతరం ఆ బాలికల ఇంటి పక్కన నివసించే ఛోటూకు సమాచారం ఇచ్చారు. ఛోటూ ఆ బాలికల ఇంటికి వెళ్లి చున్నీలు తీసుకొచ్చాడు. అలాగే తనతో పాటు కరీముద్దీన్, ఆరిఫ్లను కూడా ఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. అందరూ కలిసి బాలికల మృతదేహాలను చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యల్లా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
బాలికలు ఎంతకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న పొలంలో చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహాలు కనిపించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. అత్యాచారం చేసిన తర్వాత గొంతులు కోసి చంపినట్టు తేలడంతో పోలీసులు వెంటనే దర్యాఫ్తు ప్రారంభించారు. బాలికల తండ్రి తమ ఇంటి పక్కనే ఉండే ఛోటూ మీద అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో అతడు నిజం చెప్పేశాడు. అదే సమయానికి నిందితులు ఐదుగురూ ఊరి నుంచి పారిపోయేందుకు ప్రయత్నంలో ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.