దళిత, హిందూ డిప్యూటీ సీఎంలు: హర్సిమ్రత్ కౌర్
ABN , First Publish Date - 2021-07-16T01:13:59+05:30 IST
ఆ ఉప ముఖ్యమంత్రి దళిత వ్యక్తికే ఇవ్వనున్నట్లు హర్సిమ్రత్ కౌర్ ప్రకటించడం విశేషం. ఇంతటితో ఆగకుండా మరో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఏర్పాటు చేసి దానిని హిందూ వ్యక్తికి ఇస్తామని ప్రకటించడం మరో విశేషం
చండీగఢ్: పంజాబ్లో తాము అధికారంలోకి వస్తే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఏర్పాటు చేస్తామని శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత హర్సిమ్రత్ కౌర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి శిరోమణి అకాలీ దళ్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా పూర్తైంది. ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే పొత్తు దృష్ట్యా బీఎస్పీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఉప ముఖ్యమంత్రి దళిత వ్యక్తికే ఇవ్వనున్నట్లు హర్సిమ్రత్ కౌర్ ప్రకటించడం విశేషం. ఇంతటితో ఆగకుండా మరో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఏర్పాటు చేసి దానిని హిందూ వ్యక్తికి ఇస్తామని ప్రకటించడం మరో విశేషం. పంజాబ్లో ఎక్కువగా సిక్కులే ఉంటారు. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఆ రాష్ట్రంలో మైనారిటీలు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పదవిని హిందూ వ్యక్తికి ఇస్తామని కౌర్ ప్రకటించారు.