బైక్ను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-07-27T03:43:01+05:30 IST
గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డు చౌరస్తాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. గజ్వేల్ మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిట్ల మణికంఠ(18), గజ్వేల్కు చెందిన మేనమామ కొడుకు బాకి విష్ణు(16)తో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. తిరిగి గజ్వేల్కు వస్తున్న క్రమంలో తూప్రాన్ వైపు అతివేగంగా వెళ్తున్న డీసీఎం వారు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టి బోల్తాపడింది.
గజ్వేల్, జూలై 26: గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డు చౌరస్తాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. గజ్వేల్ మండల పరిధిలోని ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిట్ల మణికంఠ(18), గజ్వేల్కు చెందిన మేనమామ కొడుకు బాకి విష్ణు(16)తో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. తిరిగి గజ్వేల్కు వస్తున్న క్రమంలో తూప్రాన్ వైపు అతివేగంగా వెళ్తున్న డీసీఎం వారు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు 108 వాహనంలో గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మణికంఠను ఆర్వీఎం ఆస్పత్రికి, విష్ణును హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్వీఎం ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే మణికంఠ మృతిచెందగా.. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న విష్ణు కూడా మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు మంటలు చెలరేగి బైక్ కాలిపోయింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ను మండలంలోని బంగ్లావెంకటాపూర్కు చెందిన పంది ఇస్తారిగా గుర్తించారు. మద్యం మత్తులో డీసీఎం నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. మణికంఠ తండ్రి పిట్ల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపారు.