వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-03-04T05:53:32+05:30 IST

అడవి జంతువులను చంపేందుకు అటవీప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు రైతులకు తీవ్రగాయాలైన సంఘటన జిల్లాలోని మామడ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఒకరి పరిస్థితి విషమం

మామడ మండలంలో ఘటన 

మామడ, మార్చి 3 : అడవి జంతువులను చంపేందుకు అటవీప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు రైతులకు తీవ్రగాయాలైన సంఘటన జిల్లాలోని మామడ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పొన్కల్‌ గ్రామానికి చెందిన పుణ్యమూర్తి రాజు, పుణ్యమూర్తి శంకర్‌లు సోదరులు. స్థానికంగా వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజూలాగే బుధవారం రాత్రి 9గంటలకు తమ మొక్కజొన్న పంట వద్దకు కాపలా నిమిత్తం బయలుదేరారు. అదే సమయంలో వీరికి సంబంధించిన మూడు మేకలు తప్పిపోయాయి. మేకలను వెదుక్కుంటూ వెళ్లగా.. మార్గమధ్యలో అటవీప్రాంతంలో జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలను వీరు గమనించలేదు. దీంతో రాజు, శంకర్‌లు విద్యుత్‌ తీగలకు తగలడంతో.. ఒక్కసారిగా షాక్‌కు గురై, తీవ్రగాయాల పాలయ్యారు. ఇందులో శంకర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో.. చికిత్స నిమిత్తం వెంటనే 108 అంబులెన్స్‌లో నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై వినయ్‌కుమార్‌ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జింక చర్మం లభ్యమైంది. వేటగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై వినయ్‌ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-03-04T05:53:32+05:30 IST