NRI కి రూ.3.11కోట్ల కుచ్చుటోపీ
ABN , First Publish Date - 2022-05-19T16:56:56+05:30 IST
రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట NRI కి రూ.3.11 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట NRI కి రూ.3.11 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ అనే ఎన్నారై లండన్లో నివసిస్తున్నారు. నగరంలోని పారామౌంట్ కాలనీకి చెందిన ఇక్బాల్ హుస్సేన్ వ్యాపార పనుల కోసం ఏడాదికి నాలుగైదుసార్లు స్వదేశానికి వచ్చేవారు. ఈ క్రమంలో ఆయనకు 2013లో హైదరాబాద్కు వచ్చిన సమయంలో నగరానికి చెందిన రిజ్వాన్, మహ్మద్ షోయబ్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, తక్కువ సమయంలోని మంచి లాభాలు ఆర్జించవచ్చని ఉదరగొట్టారు. ఆ ఇద్దరి మాటలు నమ్మిన ఇక్బాల్ వారికి వివిధ దఫాల్లో భారీగా డబ్బులు ఇచ్చాడు. 2014 ఏప్రిల్ 3న షాద్నగర్ సమీపంలోని రెండెకరాల స్థలం కోసం రూ.44 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారు. అయితే, డబ్బులు తీసుకునప్పటికీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చారు. దాంతో ఇక్బాల్కు అనుమానం వచ్చి ఆ స్థలం విషయమై ఆరా తీశాడు. ఆ సయమంలో అతనికి షాకింగ్ విషయం తెలిసింది. ఆ స్థలానికి రిజ్వాన్, షోయబ్లకు ఎలాంటి సంబంధం లేదని తేలుసుకుని మోసపోయానని గ్రహించాడు. తనను ఆ ఇద్దరు రూ.3.11 కోట్ల మేర వారు మోసం చేశారని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక్బాల్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు రిజ్వాన్, మహ్మద్ షోయబ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.