Mahzooz draw: ఇద్దరు భారతీయులకు జాక్పాట్.. చెరో రూ.20లక్షలు గెలిచిన సేల్స్మెన్, అకౌంటెంట్
ABN , First Publish Date - 2022-04-23T15:50:49+05:30 IST
మహజూజ్ రాఫెల్లో ఇద్దరు భారత ప్రవాసులు జాక్పాట్ కొట్టారు.
దుబాయ్: మహజూజ్ రాఫెల్లో ఇద్దరు భారత ప్రవాసులు జాక్పాట్ కొట్టారు. తాజాగా నిర్వహించిన వీక్లీ డ్రాలో భాగంగా చెరో లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు. మన కరెన్సీలో రూ.20.81లక్షలు. దుబాయ్లో సేల్స్మెన్గా చేసే సల్ఫికర్(34), అకౌంటెంట్గా పనిచేసే కొచప్పన్కు ఇలా ఒకేసారి జాక్పాట్ తగిలింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. సల్ఫికర్ మాట్లాడుతూ.. లక్కీ డ్రాలో తాను గెలిచిన విషయాన్ని మొదట ఖతార్లో ఉండే తన స్నేహితుడు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నాడు. అయితే, ఏదో ఆటపట్టించేందుకు అతడు అలా చెబుతున్నాడని నమ్మలేదట. వెంటనే ఆన్లైన్ ద్వారా రాఫెల్ విజేతల వివరాలను చెక్ చేసుకున్నట్లు చెప్పాడు. అందులో తన పేరు కూడా ఉండడంతో ఆనందంతో గంతేసినంత పని చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని స్వదేశంలో తన కలల ఇంటిని నిర్మించుకోవడానికి ఖర్చు చేస్తానన్నాడు. అలాగే మిగిలిన నగదును తన పిల్లల చదువుకు వినియోగిస్తానని తెలిపాడు. మరో విజేత కొచప్పన్ మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను ఇంత భారీ మొత్తం గెలిచానంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నాడు. చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా మహజూజ్ రాఫెల్లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదని, ఏదో ఒకరోజు భారీ మొత్తం గెలుస్తాననే నమ్మకంతో చాలా ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. ఏళ్ల తరబడి ఇలా కంటిన్యూస్గా లాటరీ టికెట్లు కొనడం చూసి స్నేహితులు కూడా తనను ఆటపట్టించారని కొచప్పన్ తెలిపాడు. వారి మాటలను పట్టించుకోకుండా తాను చేసిన ప్రయత్నమే ఇన్నాళ్లకు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక కరోనా కారణంగా రెండున్నరేళ్లుగా తన కుటుంబాన్ని కలవలేకపోయాని, తాను గెలిచిన ఈ భారీ నగదు చేతికి రాగానే వెంటనే స్వదేశానికి వచ్చి ఫ్యామిలీతో కలుస్తానని చెప్పుకొచ్చాడు.