సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ నర్సులు దుర్మరణం !

ABN , First Publish Date - 2021-03-03T01:14:03+05:30 IST

ఇద్దరు భారతీయ నర్సులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది.

సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ నర్సులు దుర్మరణం !

తైఫ్: ఇద్దరు భారతీయ నర్సులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. ఆదివారం సౌదీలోని తైఫ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సులను తీసుకెళ్తున్న మినీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన అఖిల(29), సుబి(33) అనే ఇద్దరు నర్సులు ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. కాగా, మృతులను కేరళకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అఖిలది వైకోమ్ వంచియూర్ అని, సుబిది కోల్లాం అని తెలిపారు.


నర్సులు తమ క్వారంటైన్ పీరియడ్‌ను ముగించుకుని జెడ్డా నుంచి రియాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. బస్సు రోడ్డు మీద నుంచి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో అఖిల, సుబితో పాటు మరో ఇద్దరు భారతీయ నర్సులు అన్సీ, ప్రియాంక కూడా ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం తైఫ్‌లోని కింగ్ ఫైజల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-03T01:14:03+05:30 IST