యాదాద్రి జిల్లాలో పాముకాటుకు ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-01T06:04:41+05:30 IST

ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాము కాటు వేయడంతో మృతిచెందారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యాదాద్రి జిల్లాలో పాముకాటుకు ఇద్దరు మృతి

బీబీనగర్‌, జూన్‌ 30: ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాము కాటు వేయడంతో మృతిచెందారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల  ప్రకారం.. పడమటి సోమారం గ్రామానికి చెందిన బొమ్మగోని శ్రీకాంత్‌గౌడ్‌(30) కుటుంబసభ్యులు బుధవారం ఊరెళ్లారు. శ్రీకాంత్‌గౌడ్‌ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆల్వ రాంరెడ్డి(65) శ్రీకాంత్‌గౌడ్‌కు తోడుగా నిద్రించేందుకు వెళ్లాడు. తలుపులు వేసుకోకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ నిద్రపోయారు. ఈ క్రమంలో కట్లపాము శ్రీకాంత్‌గౌడ్‌ కాలుపై కాటు వేసింది. తన కాలుకు ఏదో కరిచినట్లు అనిపిస్తుందని, చూడమని చెప్పడంతో రాంరెడ్డి లేచి చూస్తుండగానే శ్రీకాంత్‌ కడుపుపై మరో కాటేసింది. పామును గుర్తించిన రాంరెడ్డి దాని లోక పట్టుకొని బయటకు విసిరేసే ప్రయత్నం చేయగా, అతడి చేతిపై కాటేసింది. పాము కరిచిందని ఇద్దరూ ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో వారు కుటుంబసభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతూ గురువారం మధ్యాహ్నం రాంరెడ్డి మృతి చెందగా, సాయంత్రం ఐదు గంటల సమయంలో శ్రీకాంత్‌గౌడ్‌ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై శ్రీకాంత్‌గౌడ్‌, రాంరెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. 

Updated Date - 2022-07-01T06:04:41+05:30 IST