స్విమ్స్‌, బర్డ్‌లో రెండు మెడికల్‌ షాపులు నామినేటెడ్‌ పద్దతిన కేటాయింపు

ABN , First Publish Date - 2022-05-26T07:48:35+05:30 IST

కడపజిల్లా పులివెందులవాసికి నామినేటెడ్‌ పద్ధతిన రెండు మెడికల్‌ షాపులను టీటీడీ కట్టబెట్టడం వైద్యవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. స్విమ్స్‌ పద్మావతి ఆస్పత్రి, బర్డ్‌ ఆస్పత్రులకు అనుబంధంగా నామమాత్రపు అద్దెతో రెండు మెడికల్‌ షాపులను కేటాయించారు

స్విమ్స్‌, బర్డ్‌లో రెండు మెడికల్‌ షాపులు నామినేటెడ్‌ పద్దతిన కేటాయింపు
బర్డ్‌ ఆస్పత్రి ఎదురుగా నామినేటెడ్‌ పద్దతిలో కేటాయించిన మెడికల్‌ షాపు

నామమాత్రపు అద్దెతో పులివెందులవాసికి కట్టబెట్టిన టీటీడీ


 తిరుపతి, మే 25 (ఆంధ్రజ్యోతి) : కడపజిల్లా పులివెందులవాసికి నామినేటెడ్‌ పద్ధతిన  రెండు మెడికల్‌ షాపులను టీటీడీ కట్టబెట్టడం వైద్యవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. స్విమ్స్‌ పద్మావతి ఆస్పత్రి, బర్డ్‌ ఆస్పత్రులకు అనుబంధంగా నామమాత్రపు అద్దెతో రెండు మెడికల్‌ షాపులను కేటాయించారు.బర్డ్‌ ఆస్పత్రికి ఎదురుగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న గదిని కేవలం నెలకు రూ.43వేలకు మెడికల్‌ షాపు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చేశారు. గతంలో ఇదే షాపుకు ఈ-ప్రొక్యూర్మెంట్‌ టెండరు పిలవగా నెలకు రూ.22.50లక్షలు పలికింది. మల్టీకేర్‌ అనే సంస్థ ప్రథమ బిడ్డర్‌గా నిలిచి షాపును దక్కించుకుంది. ఇప్పుడు ఏమాత్రం పొంతనలేని అద్దెకు కట్టబెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న పద్మావతి ఆస్పత్రి ఎదుట 700 చదరపు అడుగుల స్థలాన్ని కూడా ఇదే అద్దెతో అప్పగించేశారు. గదిని వారే కట్టుకుని మెడికల్‌ షాపు పెట్టేసుకోవచ్చు.చిన్న గదిని కూడా టీటీడీ  నిర్మించలేక స్థలాన్ని ఇచ్చేయడం వెనుక పలు సందేహాలు తలెత్తుతున్నాయి. 527 పడకలు కలిగిన పద్మావతి ఆస్పత్రిలో 11 విభాగాలున్నాయి. తాజాగా ఆంకాలజీ విభాగాన్ని కూడా పద్మావతికే మార్చేశారు. ఆంకాలజీ ఓపీ ఉన్న రోజు అన్ని విభాగాలకూ కలిపి దాదాపు 500 ఓపీలు వస్తుంటాయి.వీరంతా మందులు కొనుక్కోవాలంటే బయటకు రావాల్సిందే. ఓపెన్‌ టెండరు పెట్టడం వలన నెలకు రూ.10లక్షలకు తగ్గకుండా అద్దె వచ్చేది. స్విమ్స్‌ క్యాజువాలిటీ కింద నడుస్తోన్న మెడికల్‌ షాపు-3 అద్దె నెలకు సుమారు రూ.13లక్షలుగా ఉంది. ఖాళీగా ఉన్న స్విమ్స్‌ మెడికల్‌ షాపు 1, 2లకు ఈ-ప్రొక్యూర్మెంట్‌ టెండర్‌ను తాజా గా టీటీడీ ఆహ్వానించింది. రూ.15లక్షలు నెలసరి కనీస అద్దెగా నిర్ణయించింది.అంత డిమాండున్న చోట నామమాత్రపు అద్దెతో పులివెందులవాసికి కేటాయించడం చర్చనీయాంశమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు సంబంధించి టీటీడీ పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి.స్విమ్స్‌ ఓపీడీ భవనంలో జనరిక్‌ మెడికల్‌ షాపు పేరిట రూ.పది వేల అద్దెతో  ఏడాది క్రితం కేటాయించేశారు. తొలుత జనరిక్‌ బోర్డుతో ప్రారంభమైన సదరు షాపు నాన్‌ జనరిక్‌ మందులను కూడా విక్రయిస్తున్నట్టు విమర్శలున్నాయి.ఇప్పుడు మళ్లీ రెండు మెడికల్‌ షాపులను కడప జిల్లావాసికి కట్టబెట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మెడికల్‌ మాఫియా చేతుల్లో చిక్కుకున్న స్విమ్స్‌ టీటీడీ పరిధిలోకి చేరిన తర్వాత కూడా పరిస్థితులు మారకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఈ-టెండరు పిలిచి పారదర్శకంగా ఎందుకు మెడికల్‌ షాపును కేటాయించలేకపోతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదేపంథా కొనసాగితే టీటీడీ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశముంది. 

Updated Date - 2022-05-26T07:48:35+05:30 IST