ఇద్దరు Mlaలపై బహిష్కరణ వేటు
ABN , First Publish Date - 2022-06-23T17:25:43+05:30 IST
రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్టు తేలడంతో జేడీఎస్ తన ఇద్దరి ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కీలక నిర్ణయం
- రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డంతో పార్టీ నిర్ణయం
- అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు లేఖ
బెంగళూరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్టు తేలడంతో జేడీఎస్ తన ఇద్దరి ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ అధ్యక్షుడు బండెప్ప కాశంపూర్ మీడియాకు తెలిపారు. పార్టీ జారీ చేసిన విప్ను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. మరో రెండు రోజుల్లో స్పీకర్ విశ్వేశ్వరహెగ్డే కాగేరికి లేఖ అందిస్తామన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కోలారు ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్థికి, గుబ్బి ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినట్టు ఆధారాలతో సహా గుర్తించామన్నారు. కోర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘచర్చ అనంతరమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామితోపాటు కోర్ కమిటీ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారన్నారు.