భావన (ఫైల్)
వివాహం నిశ్చయం అయినప్పటి నుంచి పెళ్లి జరిగే వరకూ వధువుకు ఎన్నో ఆశలు, ఆశయాలు, భర్తపై చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. భర్తకు ఎన్ని చెడు అలవాట్లున్నా మానుకుని, పెళ్లి అనంతరం సంసారం సాఫీగా జరిగేలా చూడమని.. రోజూ దేవున్ని వేడుకుంటూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడే పరిచయమైన మనిషిని.. తమ జీవితంలోకి భర్తగా ఆహ్వానించడానికి మానసికంగా సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు.. యువతుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఉంటారు. దీంతో అప్పటిదాకా నిర్మించుకున్న.. వారి కలల కోటలన్నీ ఒక్కసారిగా కుప్పకూలుతూ ఉంటాయి. ఓ యువతికి ఇలాగే జరిగింది. ముహూర్తాలు లేని కారణంగా ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అయితే వరుడి కారణంగా ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ ఝాన్సీ పరిధి సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర గ్రామానికి చెందిన రామ్ సింగ్పాల్కు భావన(24) అనే కుమార్తె, సతేంద్ర పాల్, రోచేంద్ర పాల్ అనే కొడుకులు ఉన్నారు. పెద్ద కుమార్తె అయిన భావనకు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో హన్సారీకి చెందిన ఓ యువకుడితో సంబంధం ఖాయం చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఫిబ్రవరి 21న కార్యక్రమం నిర్వహించేలా మాట్లాడుకున్నారు. కట్నం కింద వరుడికి రూ.4లక్షల నగదు, బైక్, ఉంగరం చేయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడిదాకా ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు.

పెళ్లి నిశ్చయమవడంతో కాబోయే భర్తతో భావన తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కొన్నాళ్లు ప్రేమగా మాట్లాడిన యువకుడు.. తర్వాత సమస్యను లేవనెత్తాడు. తనకు కొంత స్థిరాస్తితో పాటూ అదనంగా మరికొంత బంగారు చేయించాలంటూ డిమాండ్ చేయడం మొదలెట్టాడు. మొదట సరదాగా అంటున్నాడులే అనుకుని భావన.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ అదే విషయాన్ని చాలా సీరియస్గా చెప్పడం మొదలెట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆలోచనలో పడింది. ఇంట్లో చెప్పలేక.. లోలోపల టార్చర్ పడలేక.. మానసిక క్షోభను అనుభవించింది. ఈ విషయంలో మంగళవారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు తనకు ఇక ఫోన్ చేయొద్దని చెప్పి పెట్టేశాడు.
తాను అనుకున్నది ఒక్కటి.. జరుగుతున్నది మరొకటి కావడంతో భావన తీవ్ర మనోవేదనకు గురైంది. పెళ్లి చెడిపోతే తమ పరువు పోతుందని ఆందోళన చెందింది. తానే లేకుంటే అసలు సమస్యలే ఉండవు కదా అనుకుని.. పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భావనను.. తండ్రి గమనించాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో మంచి సంబంధం చేయాలనుకున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ భావన తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి