మేం దీన్ని తట్టుకోలేకపోతున్నాం.. విమానయాన సంస్థల గగ్గోలు..!

ABN , First Publish Date - 2022-07-11T23:12:55+05:30 IST

కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పర్యాటక రంగం మళ్లీ పట్టాలెక్కుతోంది. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా విమానసర్వీసులకు డిమాండ్ పెరిగింది. అయితే..అమెరికా, ఐరోపా ఖండానికి చెందిన విమానయాన సంస్థలు మాత్రం ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో సతమతమవుతున్నాయి.

మేం దీన్ని తట్టుకోలేకపోతున్నాం.. విమానయాన సంస్థల గగ్గోలు..!

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పర్యాటక రంగం మళ్లీ పట్టాలెక్కుతోంది. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా విమానసర్వీసులకు డిమాండ్ పెరిగింది. అయితే..అమెరికా, ఐరోపా ఖండానికి చెందిన విమానయాన సంస్థలు మాత్రం ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో సతమతమవుతున్నాయి. ప్రయాణికుల తాకిడి తట్టుకోలేక.. టిక్కెట్ల అమ్మకాలను సైతం నిలిపివేస్తున్నాయి. ఐరోపాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు లుఫ్తాన్సా(Lufthansa), ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్ఎమ్(Airfrance-KLM) సంస్థ చౌక టిక్కెట్ల అమ్మకాలను ఇటీవల కొద్ది రోజులపాటు నిలిపివేశాయి. దీంతో.. ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు.  


సిబ్బంది కొరతతో అనేక ఎయిర్‌లైన్స్ సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.  విమానరాకపోకలకు సహాయ పడే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహా.. అనేక విభాగాల్లో సిబ్బంది కొరత ఉందట. ఉద్యోగులు కరోనాతో సతమతమవుతుండటం, ఇతర అత్యవసర వస్తువుల సరఫరాలో జరుగుతున్న జాప్యం కారణంగా అనేక విమాన సర్వీసులు చివరి నిమిషంలో రద్దు కావాల్సి వచ్చింది. ఈ అంతరాయాలతో ఇక్కట్ల పాలైన ప్రయాణికులు మళ్లీ కొత్త టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ గతవారం చౌక ధరల టిక్కెట్ల అమ్మకాలను కొద్ది రోజుల పాటు నిలిపివేసింది. మరో ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్‌ఎమ్ కూడా ప్రయాణికుల డిమాండ్‌ను తగ్గించేందుకు టిక్కెట్ ధరలు అమాంతంగా పెంచేసింది. ఆమ్‌స్టర్‌డ్యామ్-లండన్ విమానం టిక్కెట్ల ధర ఒకప్పుడు 150 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం 850 డాలర్లకు ఎగబాకింది. 


యావత్ విమానయాన రంగం ఇక్కట్ల పాలవుతోందని లుఫ్తాన్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్స్ రిట్టర్ తాజాగా పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ సంస్థలే కాకుండా, ఎయిర్‌పోర్టులు, వివిధ రకాల సప్లైయ్యర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్..ఇలా అన్ని విభాగాలు రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడంలో ఇబ్బంది పడుతున్నాయన్నారు. కరోనా సమయంలో పడిపోయిన డిమాండ్ ఇటీవల ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని, తట్టుకోలేనంత స్థాయిలో ఉందని వ్యాఖ్యానించారు. డిమాండ్‌ను స్థిరీకరించే క్రమంలో లుఫ్తాన్సా జర్మనీలో ఇటీవల కొన్ని విమాన సర్వీసులను రద్దుచేసింది.  మరోవైపు..  ఎయిర్‌లైన్స్ సంస్థల అనుసరిస్తున్న విధానంపై ప్రజలు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ సాయంపై ఆధారపడ్డ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పుడిలా డిమాండ్ పెరిగిందంటూ టిక్కెట్ రేట్లు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-07-11T23:12:55+05:30 IST