బాబోయ్ ఆ స్టేషన్లా..!
ABN , First Publish Date - 2022-07-30T06:14:15+05:30 IST
బాబోయ్ ఆ స్టేషన్లా..!
అజిత్సింగ్నగర్, నున్న పీఎస్ల్లో పోస్టింగ్కు విముఖత
బదిలీ చేసినా మరోచోటుకు రిక్వెస్ట్
ప్రస్తుతం పనిచేస్తున్న వారిలోనూ బదిలీ ఆలోచన
పరస్పర ఒప్పందంపై ఓ కానిస్టేబుల్ ఉయ్యూరు నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్కు వచ్చాడు. అక్కడి నుంచి అధికారులు పోలీస్ కమాండ్ కంట్రోల్కు బదిలీ చేశారు. అక్కడి నుంచి మళ్లీ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్కు పంపారు. అజిత్సింగ్నగర్ మినహా మరోచోట ఎక్కడ ఇచ్చినా పనిచేస్తానని ఆ కానిస్టేబుల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.
కొన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాం. ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏ కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియట్లేదు. నిరంతరం టెన్షన్తో పనిచేస్తున్నాం. అవకాశం వచ్చినప్పుడు మరో పోలీస్స్టేషన్కు వెళ్లిపోవాలనుకుంటున్నాం. ఇదీ నున్న పోలీస్స్టేషన్లో పరిస్థితి. ఎందుకిలా అంటే..
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఉత్తర డివిజన్లో సత్యనారాయణపురం, అజిత్సింగ్నగర్, నున్న పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ఇందులో సత్యనారాయణపురం మినహా మిగిలిన రెండు పీఎస్లలో విధులు నిర్వర్తించడానికి దిగువ స్థాయి సిబ్బంది ఆసక్తి చూపించట్లేదు. బదిలీ చేసినా కొత్తవారు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడట్లేదు. సాధారణంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్కు పోటీ ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత చాలామంది సీసీఎస్లో పోస్టింగ్ను కోరుకుంటారు. ఇళ్లకు ఉన్న దూరాన్ని బట్టి కాస్త దగ్గరగా ఉన్న స్టేషన్లలో పోస్టింగ్లను కానిస్టేబుళ్లు కోరుకుంటారు. శాంతిభద్రతల స్టేషన్లో గానీ, ట్రాఫిక్ స్టేషన్లో గానీ పోస్టింగ్ పడిదంటే ఆగమేఘాలపై వెళ్లిపోతారు. కానీ, అజిత్సింగ్నగర్, నున్న పోలీస్స్టేషన్ల విషయంలో మాత్రం భిన్న వైఖరి కనిపిస్తోంది. ఈ విషయాన్ని కమిషనరేట్ ఉన్నతాధికారులు గుర్తించారు. అసలు ఈ రెండు పోలీస్స్టేషన్లకు కొత్తవారు వెళ్లకపోవడానికి, పాతవారు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీస్తున్నారు.
చిత్ర విచిత్రమైన కేసులు
అజిత్సింగ్నగర్, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు భౌగోళికంగా సెమీ అర్బన్గా ఉంటాయి. గ్రామీణ, నగర జీవనవిధానం మిశ్రమమై ఉంటుంది. ఇక్కడ నివాసం ఉండే వారిలో ఎక్కువ మంది శ్రామిక వర్గానికి చెందినవారు. పోలీసు కమిషనరేట్ మొత్తం మీద ఎఫ్ఐఆర్లు ఎక్కువగా నమోదవుతున్న స్టేషన్లలో ఈ రెండూ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు స్టేషన్లకు వస్తున్న కేసులు చిత్ర విచిత్రమైనవి. ముఖ్యంగా అదృశ్యం కేసులు ఇక్కడ పనిచేసే సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పైగా ఈ రెండు పీఎస్ల పరిధిలోని ప్రాంతాలు సున్నితమైనవి, సమస్యాత్మకమైనవి. ఇక్కడ రౌడీషీటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మొత్తం పరిణామాలతో కొత్తవారు కొలువులో చేరడానికి వెనక్కి తగ్గుతున్నారు. పనిచేస్తున్న వారు వెళ్లిపోదామనుకుంటున్నారు.