మోసగాళ్ల అవతారమెత్తిన ఇద్దరు సీనియర్ సిటిజెన్లు.. వారిద్దరూ ఎవరిని టార్గెట్ చేసేవారంటే..

ABN , First Publish Date - 2022-02-18T05:51:15+05:30 IST

వారిద్దరూ వృద్ధులు. కానీ సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో మోసగాళ్లుగా మారారు. వారి టార్గెట్ కూడా వృద్ధాప్యంలో ఉన్నవారే. ఇక తమకు తిరుగేలేదనుకున్న వారికి పోలీసులు ఒక్కసారిగా చెక్ పెట్టారు...

మోసగాళ్ల అవతారమెత్తిన ఇద్దరు సీనియర్ సిటిజెన్లు.. వారిద్దరూ ఎవరిని టార్గెట్ చేసేవారంటే..

వారిద్దరూ వృద్ధులు. కానీ సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో మోసగాళ్లుగా మారారు. వారి టార్గెట్ కూడా వృద్ధాప్యంలో ఉన్నవారే. ఇక తమకు తిరుగేలేదనుకున్న వారికి పోలీసులు ఒక్కసారిగా చెక్ పెట్టారు.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలో ఒక కాలనీ వద్ద కొన్ని రోజుల క్రితం ఇద్దరు వృద్ధులు వచ్చారు. వారిద్దరూ సమీపంలోని ఒక లాడ్జిలో ఒక గది అద్దెకు తీసుకొని ఉన్నారు. ఆ కాలనీలో వారిద్దరూ బాగా రెక్కీ నిర్వహించి ఒక వృద్ధురాలితో పరిచయం పెంచుకున్నారు. ఒకరోజు ఉదయం ఆ వృద్ధురాలి ఇంటి తలుపులు తట్టి ఆమెకు కొంత డబ్బు సహాయం కావాలని కోరారు.


తమ వద్ద బయట దేశం నుంచి తెచ్చిన కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయని.. వాటిని ఆ రూపంలో బయట విక్రయించలేమని చెప్పారు. వాటిని తీసుకొని కొంత డబ్బులు లేదా.. ఏదైనా బంగారు ఆభరణాలు ఇమ్మని ఆమెను కోరారు. ఆ వృద్ధురాలు వారి వద్ద ఉన్న బంగారు బిస్కెట్లు చూసింది. అవి నాలుగు తులాలు(40 గ్రాములు)దాకా ఉన్నాయి. ఆమె వాటిని తీసుకొని తన ఉన్న అరతులం(5 గ్రాములు)బంగారు చైన్ ఇచ్చింది. ఆ చైన్ తీసుకొని ఇద్దరు ముసలివాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ కాసేపటి తరువాత ఆ వృద్ధురాలి కొడుకు ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆమె తన కుమారుడికి జరిగిన విషయం చెప్పి ఆ వృద్ధులు ఇచ్చిన బంగారు బిస్కెట్లు చూపించింది. 


అవి చూసిన వృద్ధురాలి కుమారుడు.. ఆ బిస్కెట్లు నకిలీవని గ్రహించాడు. దీంతో ఆ వృద్ధురాలు తాను మోసపోయానని గ్రహించింది. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ కాలనీ పరిసరాల్లోని అన్ని సీసీటీవి వీడియోలు పరిశీలించగా.. ఆ ఇద్దరు ముదురు దొంగలు కనిపించారు. వారి ఫోటోలను తీసుకొని నగరమంతా గాలించగా.. ఇద్దరు రైల్వే స్టేషన్ వద్ద పట్టుబడ్డారు. 


ఆ ఇద్దరు వృద్ధ దొంగలను విచారణ చేయగా.. వారు ఇది వరకే ఇలాంటి దోపిడీలు చాలా చేశారని వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని మిర్జాపూర్ నగరానికి చెందిన నవల్ కుమార్(65), ఘార్ ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తాడాలో నివసించే అర్జున్ ప్రసాద్(67) ఇద్దరికీ కుటుంబ పరంగా ఎవరూ లేరు. ఆ లేటు వయసులో ఉద్యోగం చేసే ఓపిక లేక.. ఇద్దరూ సులువుగా డబ్బు సంపాదించడానికి మోసగాళ్ల అవతారమెత్తారు.


ఇద్దరూ కలిసి పశ్చిమ బెంగాల్, బీహార్, ఘార్ఖండ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటిజెన్లను టార్గెట్ చేసేవారు. బాధితులతో పరిచయం చేసుకొని తమకు ఏదో అత్యవసరమైన ఆపద వచ్చిందని చెప్పి సహాయం అడిగేవారు. వయసు రీత్యా వారిపై ఎవరికీ అనుమానం రాకపోవడంతో.. ఇద్దరూ సులువుగా మోసాలు చేసి డబ్బుతో పరారయ్యేవారు.


Updated Date - 2022-02-18T05:51:15+05:30 IST