బొలెరో వాహనం బైక్‌ను ఢీకొని ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-05-11T06:13:30+05:30 IST

సెలవుల్లో తాతతో కలసి మనవరాలు బైక్‌పై అమ్మమ్మగారింటికి వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

బొలెరో వాహనం బైక్‌ను ఢీకొని ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అనన్య, మృతి చెందిన నర్సారెడ్డి

గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌ చౌరస్తాలో ప్రమాదం

తాతతో కలిసి మనవరాలు అమ్మమ్మగారింటికి వెళ్తుండగా ఘటన

గజ్వేల్‌, మే 10: సెలవుల్లో తాతతో కలసి మనవరాలు బైక్‌పై  అమ్మమ్మగారింటికి వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన గజ్వేల్‌ మండలంలోని అహ్మదీపూర్‌ చౌరస్తాలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నాగర్తి నర్సారెడ్డి(65) గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌ గ్రామంలో నివసించే కూతురు కుంట కల్పన ఇంటికి ఆదివారం వచ్చారు. మరునాడు ఉదయం తన పెద్ద మనువరాలు అయిన కుంట అనన్య(8)ను వెంటబెట్టుకుని బైక్‌పై తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో అహ్మదీపూర్‌ చౌరస్తా వద్ద గజ్వేల్‌ వైపుకు టర్న్‌ అవుతుండగా గజ్వేల్‌ నుంచి వస్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తాత నర్సారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, మనవరాలు అనన్య తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను గజ్వేల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు తెలిపారు. కాగా అనన్య మృతితో అహ్మదీపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Updated Date - 2021-05-11T06:13:30+05:30 IST