ఒక్క పతకం.. ఇద్దరు ఆటగాళ్లు.. టోక్యో ఒలింపిక్స్లో విచిత్రం.. చివరికి..
ABN , First Publish Date - 2021-08-02T06:31:12+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే బంగారు పతకాన్ని ఇద్దరు ఆటగాళ్లు పంచుకున్నారు. దీనికి ఆ ఆటగాళ్లు కూడా..
టోక్యో ఒలింపిక్స్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే బంగారు పతకాన్ని ఇద్దరు ఆటగాళ్లు పంచుకున్నారు. దీనికి ఆ ఆటగాళ్లు కూడా అంగీకరించారు. వివరాల్లోకి వెళితే.. కతార్కు చెందిన ముతాజ్ ఎస్సా బర్షిమ్, ఇటలీకి చెందిన గియాన్మార్కో తంబేరీ ఇద్దరూ హై జంప్ పోటీల్లో పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో మిగతా దేశాల పోటీదారులందరినీ వెనక్కి నెడుతూ బర్షిమ్, తంబెరీ ఫైనల్కు దూసుకొచ్చారు. అయితే ఫైనల్స్లో ఇద్దరూ కూడా సరిసమానంగా 2.37 మీటర్ల ఎత్తును హై జంప్ చేశారు. అయితే 2.39 మీటర్ల ఎత్తులో మాత్రం ఇద్దరూ ఓడిపోయారు. మ్యాచ్ టై బ్రేకర్గా ముగిసింది.
దీంతో టోర్నీ మేనేజ్మెంట్ గోల్డ్ ఎవరికివ్వాలా ఆలోచనలో పడింది. అయితే మళ్లీ ప్రత్యేకంగా పోటీ పడాలనుకుంటే పడవచ్చని ఇద్దరికీ సూచించింది. కానీ బర్షిమ్ ఒలింపిక్స్ జడ్జిల ముందు ఓ ప్రతిపాదన ఉంచాడు. తమకిద్దరికీ రెండు గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని కోరాడు. దీనికి జడ్జిలు కూడా అంగీకరించడంతో ఇద్దరికీ ఒక్కో గోల్డ్ మెడల్ను ఇచ్చి.. ఇద్దరినీ ఒకే మెడల్ విజేతలుగా ప్రకటించారు.
తామిద్దరం టోర్నీలోనే కాకుండా బయట కూడా ఎంతో మంచి మిత్రులమని, అలాంటిది తామే గోల్డ్ మెడల్ను ఇలా పంచుకొనే అవకాశం రావడం నిజంగా గొప్ప అనుభూతని ఇద్దరూ చెప్పుకొచ్చారు.