బఠాణి గింజ ప్రాణం తీసింది!
ABN , First Publish Date - 2021-09-18T03:38:26+05:30 IST
రెండేళ్ల చిన్నారి గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు.
గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చిన్నారి మృతి
శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
ఉదయగిరి రూరల్, సెప్టెంబరు 17: రెండేళ్ల చిన్నారి గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. సీతారామపురం మండలం అయ్యవారిపల్లికి చెందిన చప్పిలి ఏసురత్నం, నరసమ్మ దంపతులు కొంతకాలంగా ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి నులుగురు సంతానం. శుక్రవారం వీరి మూడో సంతానమైన రెండేళ్ల కుమారుడు కిరణ్ ఇంట్లో ఆడుకుంటూ ప్లేట్లో ఉన్న బఠాణీలు తింటుండగా గమనించిన తల్లి వాటిని అక్కడ నుంచి తీసేసింది. అనంతరం చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండడంతో అనుమానం వచ్చి గొంతులో చూసి బఠాణీలు ఇరుక్కున్నట్లు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుడు సుభానీబాషా వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతదేహాన్ని వారి స్వగ్రామమైన సీతారామపురం మండలం అయ్యవారిపల్లికి తరలించారు.