Hyderabadలో ఇద్దరిని బలిగొన్న టిప్పర్లు.. మృతదేహాన్ని 20మీటర్లు ఈడ్చుకుపోయిన Driver
ABN , First Publish Date - 2022-01-10T15:48:02+05:30 IST
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
- కూకట్పల్లిలో ఒకరు..
- పెద్ద అంబర్పేటలో మరొకరు దుర్మరణం
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్ : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రెండు ఘటనల్లోనూ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్లే కారణం కావడం గమనార్హం. కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఎద్దుల జగన్మోహన్రెడ్డి(28) నాగోల్లో స్నేహితులతో కలిసి నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున జగన్ కూకట్పల్లి నుంచి కేపీహెచ్బీ వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఆ వాహనాన్ని వేగంగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా.. సుమారు 20 మీటర్ల వరకు మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లినట్లు సీసీకెమెరాలో రికార్డైంది. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మలుపు తిరుగుతుండగా..
పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఓ టిప్పర్ స్కూటీని ఢీ కొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. తట్టిఅన్నారం ఆర్కేనగర్కు చెందిన మూడావత్ లక్ష్మణ్ (19), శివశంకర్ స్కూటీపై పెద్ద అంబర్పేట్కు వచ్చారు. ఔటర్ యూటర్న్ వద్ద మలుపు తిరుగుతుండగా విజయవాడ వైపు నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ స్కూటీని ఢీ కొట్టింది. దీంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలతో శివశంకర్ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.