భారత్ సహా పలు దేశాల చార్టర్డ్ విమాన ప్రయాణికులపై యూఏఈ కఠిన ఆంక్షలు!
ABN , First Publish Date - 2021-06-15T18:00:46+05:30 IST
భారత్ సహా పలు నిషేధిత దేశాల చార్టర్డ్ విమానాల ప్రయాణికులపై తాజాగా యూఏఈ మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది.
అబుధాబి: భారత్ సహా పలు నిషేధిత దేశాల చార్టర్డ్ విమానాల ప్రయాణికులపై తాజాగా యూఏఈ మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ఈ మేరకు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) తాజాగా కొత్త ఆంక్షలను విడుదల చేసింది. దీనిలో భాగంగా చార్టర్డ్ విమానాల ద్వారా ఆయా దేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు ట్రాకింగ్ డివైజ్ను ధరించడం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా షార్జా, రాస్ అల్ ఖైమా వెళ్లే ప్రయాణికులకు ఈ నిబంధన తప్పనిసరి. యూఏఈ నుంచి బంగ్లాదేశ్, డీఆర్ కాంగో, భారత్, నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, ఉగాండా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, జాంబియాకు సర్వీసులు నడిపే ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్లందరూ వెంటనే ఈ నిబంధనను అమలు చేయాలని జీసీఏఏ ఆదేశించింది.
కాగా, షార్జా, రాస్ అల్ ఖైమా, అబుధాబి వచ్చే ప్రయాణికులకు ఇప్పటికే తాము చేతికి ధరించే ట్రాకింగ్ డివైజ్లను ఇస్తున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు, చార్టర్డ్ విమాన ఆపరేటర్లు పేర్కొన్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచే అబుధాబి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్లో ఉండే 14 రోజుల పాటు ఈ డివైజ్లను ధరించడం తప్పనిసరి చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ ట్రాకింగ్ డివైజ్తో పాటు 10 రోజుల క్వారంటైన్, గమ్యస్థానానికి చేరుకోగానే పీసీఆర్ టెస్టు, క్వారంటైన్లో ఉండే నాల్గో, ఎనిమిదో రోజు మళ్లీ రెండు పీసీఆర్ టెస్టులు వంటి నిబంధనలు తప్పనిసరి అని ఈ సందర్భంగా జీసీఏఏ వెల్లడించింది.