Udaipur killing కేసులో నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు
ABN , First Publish Date - 2022-06-29T16:54:09+05:30 IST
ఉదయపూర్ హత్య కేసులో నిందితుడికి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని వెల్లడైంది...
ఉదయపూర్(రాజస్థాన్): ఉదయపూర్ హత్య కేసులో నిందితుడికి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని వెల్లడైంది.రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్లో ఓ టైలర్ తల నరికి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు నిందితులకు పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని భద్రతా సంస్థలు బుధవారం వెల్లడించాయి.నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఉదయ్పూర్లో ఒక టైలరును ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.టైలర్ కన్హయ్య లాల్ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఉదయ్పూర్ హత్య కెమెరాలో రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాక్ సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో లింక్
కన్హయ్య లాల్ను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్లుగా గుర్తించారు. మరొక వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా బెదిరించారు. జూన్ 17న రికార్డ్ చేసిన మూడో వీడియో మంగళవారం హత్య తర్వాత బయటపడింది. హత్య తర్వాత వెలువడిన వీడియోలలో కన్హయ్య లాల్ మృతదేహం అతని దుకాణం వెలుపల పేవ్మెంట్పై పడి ఉంది.నిందితులు ఖంజీపీర్లోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నారు. భిల్వారాకు చెందిన రియాజ్ ఖాన్జీపీర్ ఉదయపూర్లో అద్దెకు ఉండగా, గౌస్ రాజస్మాండ్లోని భీమాకు చెందినవాడు. వారి మూలాల ప్రకారం నిందితులు ఇద్దరూ పాకిస్తాన్లోని ఒక ముస్లిం ఛాందసవాద సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలున్నాయి.
మా మామయ్యపై చర్యలు తీసుకోవాలి...మేనల్లుడి వ్యాఖ్య
‘‘మా మామయ్య చేసిన పని ఖండించదగినది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భిల్వాడలో నివసించే రియాజ్ మేనల్లుడు వ్యాఖ్యానించారు. నిందితులిద్దరూ ప్రస్తుతం రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలో చార్భుజ పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్నారు.సస్పెండ్ అయిన మరో బీజేపీ నేత నవీన్ జిందాల్ తనకు కన్హయ్య లాల్ లాంటి గతి తప్పదని బెదిరించిన ఈమెయిల్ల స్క్రీన్షాట్లను ట్వీట్ చేశారు.ప్రధాని మోదీని బెదిరిస్తున్న నిందితుల వీడియో బయటపడడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని అంచనా వేయడానికి భద్రతా సంస్థలు ఇప్పుడు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.