ఉద్ధవ్ రెండుసార్లు రాజీనామా చేయాలకున్నారు..కానీ..!
ABN , First Publish Date - 2022-06-28T02:25:26+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గతంలోనే రాజీనామా...
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) గతంలోనే రాజీనామా (Resign) చేయాలనుకున్నారట. కానీ కూటమి భాగస్వామి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అడ్డుకున్నారట. ఇలా ఒకసారి కాదు...రెండుసార్లు జరిగిందట. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభ వేళ విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి.
తాజా కథనం ప్రకారం...ఉద్ధవ్ థాకరే జూన్ 22న ఫేస్బుక్ లైవ్లో పాల్గొన్న తర్వాత మొదటిసారి రాజీనామా చేయాలని అనుకున్నారు. వెంటనే ఆ పని చేయవద్దని పవార్ వారించారు. ఆ తర్వాత రోజు కూడా సెక్రటరీలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఉద్ధవ్ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. తొందర పడవద్దని మరోసారి శరద్ పవార్ ఆయనను అడ్డుకున్నారు. కాగా, ఏక్నాథ్ షిండే రెబల్గా మారడంతో సయోధ్య ప్రయత్నాల్లో భాగంగా జూన్ 21వ తేదీ రాత్రి ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ను కూడా ఉద్ధవ్ సంప్రదించినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాజ్థాకరే సారథ్యంలోని ఎంఎన్ఎస్లో కూడా షిండే వర్గం విలీనం కాదని కూడా వారు అంటున్నారు.
ఆ రెండిట్లో ఏదో ఒకటి జరగొచ్చు...
మరోవైపు, ఏక్నాథ్ షిండే వర్గం గవర్నర్కు లేఖ ఇవ్వడం కానీ, మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నరే స్వయంగా ముఖ్యమంత్రిని ఆదేశించడం కానీ జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు, బీజేపీ సైతం బలపరీక్షను దృష్టిలో ఉంచుకుని ముంబైకి రావాల్సిందిగా తమ ఎమ్మెల్యేలను పిలిచేందుకు సిద్ధమవుతోంది. సొంత ఎమ్మెల్యేలు, చిన్నపార్టీలు, ఇండిపెండెట్లను కలుపుకొని తమ బలం 129 వరకూ ఉంటుందని బీజేపీ నమ్మకంగా ఉంది. ఇటు ఉద్ధవ్ థాకరే శిబిరానికి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏసమయంలోనైనా ఏక్నాథ్ షిండే వర్గంలోకి వెళ్లిపోతారనే ప్రచారమూ బలంగా జరుగుతోంది.