అడుగుపెట్టాలంటే భయం...
ABN , First Publish Date - 2020-11-29T04:26:00+05:30 IST
నివర్ తుఫాన్ వరద నీరు పాత బస్టాండును ముంచెత్తింది.
బురదమయమైన పాతబస్టాండు
నీటమునిగిన 30 దుకాణాలు
స్టాండుకు రాని బస్సులు
కడప (నాగరాజుపేట), నవంబరు 28: నివర్ తుఫాన్ వరద నీరు పాత బస్టాండును ముంచెత్తింది. బస్టాండు ప్రహారీగోడకు, బ్రిడ్జికి మధ్యన ఉన్న పది మీటర్ల ఖాళీ జాగా నుంచి వచ్చిన వరదనీటిలో బస్టాండు న డుములోతు మునిగిపోయి బురదను మిగిల్చింది. జిల్లా కేంద్రం నుంచి నలుమూలలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్టాండు ప్రాంతంలో అడుగు పెట్టాలంటే వణికిపోతున్నారు. బురద, కుళ్లిన చెత్తాచెదారాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. దాదాపు 30 దుకాణాలు మునిగి తేలడంతో లక్షల్లో వ్యాపారులకు నష్టం జరగడమేకాక దుకాణాల్లో బురద పేరుకుపోయింది. పాత బస్టాండుకు వెళ్లాల్సిన ఆయా సర్వీసుల బస్సులు వెళ్లలేదు. అరకొర వెళ్లే బస్సులు మొదట్లోనే తిరిగి వెళుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీసీ అధికారులు పాత బస్టాండును పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని వారు కోరుతున్నారు.
నిన్న కరోనా... నేడు నివర్ తుఫాన్
కరోనాతో అయిదు నెలలు దుకాణాలు మూసివేసి అప్పులు చేసుకుని రూములకు అద్దెలు చెల్లించాము. వ్యాపారాలు మొదలై మూడు నెలలు కూడా జరుగకముందే నివర్ తుఫాను వచ్చి తీవ్రంగా నష్టపరిచింది. వరదనీటిపై సంబంధిత అధికారులు సమాచారం కూడా ఇవ్వలేదు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించి న్యాయం చేయాలి.
- షేక్ చాంద్బాష, వ్యాపారి
బియ్యం, సరుకులు తడిసిపోయాయి
వరదనీరు పాత బస్టాండును ముంచెత్తుతుందని ఊహించలేదు. హోటల్లో ఉన్న బియ్యం, సరుకులు తడిచిపోవడమేకాక ఎలకా్ట్రనిక్ వస్తువులు పాడైపోయాయి. వెంటనే మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
- చిట్టిబాబు, హోటల్ నిర్వాహకుడు