నగరంలో.. నరకం!

ABN , First Publish Date - 2020-12-02T04:53:39+05:30 IST

జిల్లా కేంద్రమైన కడప నగరంలోని చాలా ప్రాంతాలు నరకానికి నకలుగా మారాయి. నివర్‌ తుఫాను కారణంగా నగరంలో ఎటు చూసినా బురద, చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి.

నగరంలో.. నరకం!
రోడ్లపై కుప్పలుగా ఉన్న పరుపులు, చెత్తా చెదారం

లోతట్టు ప్రాంతాలన్నీ బురదబురద 

శివారు ప్రాంతాల్లో నిలిచిన నీళ్లు


కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 1: జిల్లా కేంద్రమైన కడప నగరంలోని చాలా ప్రాంతాలు నరకానికి నకలుగా మారాయి. నివర్‌ తుఫాను కారణంగా నగరంలో ఎటు చూసినా బురద, చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. వాటిలోకి ఎలుకలు, పందికొక్కులు చేరుతున్నాయి. ఈగలు ఝుమ్మంటూ ముసురుతున్నాయి. బుగ్గవంకకు ఇరువైపులా ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు, పరుపులు, బియ్యం, బట్టలు ఇలా అన్నీ బురదమయమయ్యాయి. పాడైపోయిన వస్తువులు, బియ్యం, బట్టలను రోడ్డుపైనే కుప్పలుగా వేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో దుర్గంధం వెలువడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటువ్యాఽధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


శివారు ప్రాంతాలపై దృష్టి సారించని అధికారులు

కడప కార్పొరేషన్‌ పరిధిలోని శివారు ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నివర్‌ తుఫానులో భాగంగా నాయకులు, అధికారులు బుగ్గవంక ఇరువైపు ప్రాంతాల్లో పర్యటించారు. నగర శివారు ప్రాంతాలైన ఏఎ్‌సఆర్‌నగర్‌, రామరాజుపల్లె, బుడగజంగంకాలనీ వైపు రాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు చేపట్టారు. దీంతో వర్షం నీళ్లు వెళ్లే మార్గాలు లేకుండాపోయాయి. నివర్‌ తుఫాను కారణంగా ఈ ప్రాంతాల్లో ఏ పక్క చూసినా నీళ్లే. దీంతో సాయంత్రం అయిందంటే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి నిల్వలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.



Updated Date - 2020-12-02T04:53:39+05:30 IST