జీ7 సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం

ABN , First Publish Date - 2021-01-17T19:24:55+05:30 IST

యూకేలో జరగబోయే జీ7 సమావేశాలకు రావాల్సిందిగా యూకే ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. జూన్‌లో జరగబోయే

జీ7 సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం

న్యూఢిల్లీ : యూకేలో జరగబోయే జీ7 సమావేశాలకు రావాల్సిందిగా యూకే ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. జూన్‌లో జరగబోయే ఈ జీ7 సమ్మిట్‌కు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాను కూడా యూకే ప్రభుత్వం ఆహ్వానించింది. కరోనా, వాతావరణ మార్పు, సాంకేతిక మార్పులు, శాస్త్రీయత, బహిరంగ వాణిజ్యం లాంటి అంశాలపై ఈ సమ్మిట్ చర్చించనుంది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, వివిధ సమస్యలపై అంతర్జాతీయంగా నిర్ణయాలు తీసుకోడానికి జీ7 సమ్మిట్ ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని యూకే ప్రధాని బోరిక్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పును రద్దు చేయడం నుంచి రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకునే అంశాల వరకూ జీ7 స్పందించిందని, ప్రపంచం మొత్తం జీ7 వైపు చూస్తోందని ఆయన ప్రకటించారు.


కరోనా వైరస్ అనేది విధ్వంసకరమైన వైరస్సేనని, అందులో ఎలాంటి అనుమానాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆధునిక ప్రపంచానికి ఓ సవాల్ లాంటిదని జాన్సన్ అన్నారు. మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలంటే అందరూ కలిసి పోరాడమే ఏకైక స్ఫూర్తి అని బోరిక్ జాన్సన్ ప్రకటించారు.  అయితే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రధాని జాన్సన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అయితే బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన రద్దైందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే... జీ7 సమ్మిట్ కంటే ముందే బోరిక్ జాన్సన్ భారత పర్యటన ఉంటుందని తాజాగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2021-01-17T19:24:55+05:30 IST