3,500 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టాం : ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-02-26T20:19:15+05:30 IST

రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్

3,500 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టాం : ఉక్రెయిన్

కీవ్ : రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. 14 రష్యా యుద్ధ విమానాలను కూల్చేశామని, 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. సుమారు 3,500 మంది రష్యన్ దురాక్రమణదారులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ప్రకటనను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, తమ మిత్ర దేశాల నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలు రాబోతున్నట్లు తెలిపారు. యుద్ధ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్‌తో మాట్లాడారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌కు 600 మిలియన్ డాలర్లు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో NATO  స్పందన దళాన్ని యాక్టివేట్ చేశారు. సైన్యం, వాయు సేన, నావికా దళం దీనిలో ఉన్నాయి. NATO సుప్రీం అల్లయిడ్ కమాండర్ జనరల్ టోడ్ వోల్టర్స్ ఈ దళాన్ని యాక్టివేట్ చేశారు. అయితే NATOలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లేదు. కాబట్టి ఈ దళం ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు. 


Updated Date - 2022-02-26T20:19:15+05:30 IST