నేను పారిపోలేదు : జెలెన్స్కీ
ABN , First Publish Date - 2022-03-05T19:33:57+05:30 IST
రష్యన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్ : రష్యన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం తిప్పికొట్టారు. తాను పోలండ్కు వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాను కీవ్లోనే, తన కార్యాలయంలోనే ఉన్నానని తెలిపారు. ఓ అధికారితో కలిసి తన కార్యాలయంలో ఉన్నట్లు కనిపించే విధంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన విడుదల చేసిన రెండో వీడియో ఇది.
జెలెన్స్కీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయనతోపాటు ఓ అధికారి కనిపిస్తున్నారు. ఇది కీవ్లోని తన కార్యాలయమని ఆయన తెలిపారు. ‘‘నేను కీవ్లోనే ఉన్నాను. నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఎవరూ తప్పించుకోలేదు’’ అని పేర్కొన్నారు.
రష్యాకు చెందిన రాజకీయ నేత వ్యచెస్లావ్ వోలోడిన్ మీడియాతో మాట్లాడుతూ, జెలెన్స్కీ ఉక్రెయిన్ నుంచి పోలండ్ పారిపోయారని చెప్పారు. ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యులకు జెలెన్స్కీ అందుబాటులో లేరని తెలిపారు. రష్యా దళాల దాడులు తీవ్రమవడంతో ఉక్రెయిన్ పార్లమెంటు రహస్య సమావేశానికి ముందే జెలెన్స్కీ పారిపోయారని చెప్పారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన వెంటనే జెలెన్స్కీ దేశం విడిచి వెళ్ళిపోయారని వదంతులు ప్రచారమయ్యాయి. ఈ ప్రచారాన్ని జెలెన్స్కీ తిప్పికొడుతూ ఫిబ్రవరి 26న ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. సురక్షితంగా తరలిస్తామని అమెరికా ఇచ్చిన ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించారు. తనను వేరొక చోటుకు తీసుకెళ్ళడం కాదని, తనకు ఆయుధాలు కావాలని చెప్పారు.