Ukraine నుంచి వచ్చిన విద్యార్థులకు కేంద్రం షాక్

ABN , First Publish Date - 2022-07-29T01:43:36+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి చేరుకున్న భారతీయ

Ukraine నుంచి వచ్చిన విద్యార్థులకు కేంద్రం షాక్

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి చేరుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం షాకిచ్చింది. సగం చదువులతో ఉక్రెయిన్ (Ukraine) నుంచి వచ్చి ఇక్కడ వాటిని పూర్తి చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు చదువును కొనసాగించేందుకు అనుమతించవని పేర్కొంది.


ఉక్రెయిన్‌పై రష్యా (Russia) యుద్ధం ప్రారంభించిన తర్వాత దాదాపు 20 వేల మంది విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చారు. తమ చదువులు సగంలో ఆగిపోవడంతో మిగతా చదువును పూర్తి చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా వారంతా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే, ప్రస్తుతానికైతే వారికి అనుమతి ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. 


ఉక్రెయిన్ విద్యాశాఖ అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఆన్‌లైన్ కోర్సులను కొనసాగించేందుకు వారు హామీ ఇచ్చారని కేంద్రం పేర్కొంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 ప్రకారం.. ఏదైనా విదేశీ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కళాశాలలో వసతి కల్పించడానికి కానీ, లేదంటే బదిలీ చేయడానికి సంబంధించిన నిబంధనలు లేవని స్పష్టం  చేసింది.  


కేంద్ర చేసిన ఈ ప్రకటన తర్వాత యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థు తీవ్ర నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తామిక్కడ చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


Updated Date - 2022-07-29T01:43:36+05:30 IST