Liquor shopపై గోపేడ విసిరిన మాజీ సీఎం Uma Bharti

ABN , First Publish Date - 2022-06-15T23:38:39+05:30 IST

చాలా కాలంగా మద్యపాన నిషేధం చేయాలంటూ ఆందోళన చేస్తున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తాజాగా మరోసారి తన నిరసనను కాస్త బలంగా వ్యక్తపరిచారు. నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలో ఉన్న ఒక మద్యం దుకాణంపై గోపేడ విసురుతూ మద్య నిషేధం చేయాలని ఆమె నినాదాలు చేశారు..

Liquor shopపై గోపేడ విసిరిన మాజీ సీఎం Uma Bharti

భోపాల్: చాలా కాలంగా మద్యపాన నిషేధం చేయాలంటూ ఆందోళన చేస్తున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తాజాగా మరోసారి తన నిరసనను కాస్త బలంగా వ్యక్తపరిచారు. నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలో ఉన్న ఒక మద్యం దుకాణంపై గోపేడ విసురుతూ మద్య నిషేధం చేయాలని ఆమె నినాదాలు చేశారు. కాగా, గతంలో కూడా ఇలాగే స్పందించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని ఒక మద్యం దుకాణంపైకి తన మద్దతుదారులతో కలిసి వచ్చి షాపులో ఉన్న సీసాలపైకి రాళ్లు విసిరారు. అయితే మద్య నిషేధంపై ఆందోళన ఎప్పుడూ భోపాల్‌లోనే చేపట్టే ఉమా భారతి.. ఈసారి భోపాల్ బయట చేయడం గమనార్హం.


వాస్తవానికి ఈ ఏడాది జనవరి 15లోపు ప్రభుత్వం మద్య నిషేధం విధించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతానని హెచ్చరించారు. కానీ, ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదు. పైగా ఉమాభారతి విధించిన డెడ్‌లైన్ ముగిసిన రెండు రోజులకు నూతన లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది శివరాజ్ సింగ్ ప్రభుత్వం. విదేశీ లిక్కర్‌పై 10-13 శాతం మేరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. దీంతో రాష్ట్రంలో లిక్కర్ మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2,544 దేశీయ మద్యం దుకాణాలు, 1,061 విదేశీ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ద్రాక్ష, బ్లాక్ ప్లమ్స్ నుంచి లిక్కర్ తయారు చేయడానికి మద్యం ఉత్పత్తిదారులకు అనుమతి ఇచ్చింది. ఇదే కాకుండా గతంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ లిక్కర్‌ను నిల్వ చేసేకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది.


మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఉమా భారతి, రాష్ట్రంలో బీజేపీకి సీనియర్ నేత. ఒకవైపు ఆమె మద్య నిషేధం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే శివరాజ్ సింగ్ ప్రభుత్వం మద్య విక్రయంలో సులభతర పద్దతులు తీసుకురావడం పట్ల పార్టీలో తగాదాలు పెరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగోసారి మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్న శివరాజ్‌కు పార్టీలో గట్టి పట్టే ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన ఉమాభారతికి సైతం పార్టీలో గట్టి పట్టే ఉంది. ఒకవేళ వీరిమధ్య విబేధాలు పెరిగితే పార్టీ పరిస్థితి ఏంటని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Updated Date - 2022-06-15T23:38:39+05:30 IST