ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటీషన్ 23కు వాయిదా
ABN , First Publish Date - 2022-03-22T02:04:30+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-3 నిందితుడైన గజ్జల ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటీషన్ 23వ తేదీకి వాయిదాపడింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-3 నిందితుడైన గజ్జల ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటీషన్ 23వ తేదీకి వాయిదాపడింది. ఈనెల 3వ తేదీన ఉమాశంకర్రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై 4, 10 తేదీలలో విచారణ జరిగింది. తన క్లయింట్ ఉమాశంకర్రెడ్డి మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని దీనిని కోర్టు పరిగణించి బెయిల్ మంజూరు చేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాది కోరారు.
పిటిషనర్ వాదనలపై సీబీఐ న్యాయవాది ప్రతి వాదనలను అన్లైన్ ద్వారా కోర్టుకు వినిపించారు. వివేకానందరెడ్డి హత్యకేసు ఇంకా విచారణ దశలోనే ఉందని ఇలాంటి సమయంలో మూడవ నిందితుడుగా ఉన్న ఉమాశంకర్రెడ్డిదాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను రద్దుపరచాలని కోరారు. ఇరువురి న్యాయవాదుల వాదనలను విన్న జడ్జి తదుపరి విచారణ 21వ తేదీకి వాయిదా వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే జడ్జి సెలవులో ఉండడంతో విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు.