తగ్గని వరద నీరు
ABN , First Publish Date - 2022-01-20T05:14:30+05:30 IST
మండలంలోని నేలంపాడు, గొట్లూరు, జంగాలపల్లె, కొట్టాలపల్లె గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో నేటికీ వరద నీరు తగ్గలేదు.
- 60 రోజులైనా నీటిలోనే పంట పొలాలు
- పట్టించుకోని అధికారులు
- ఆందోళనలో రైతులు
చాగలమర్రి, జనవరి 19: మండలంలోని నేలంపాడు, గొట్లూరు, జంగాలపల్లె, కొట్టాలపల్లె గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో నేటికీ వరద నీరు తగ్గలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గి 60 రోజులు దాటినా వరద నీరు పంట పొలాల్లో నిలిచి ఉన్నాయి. 1,000 ఎకరాల దాకా వరద నీటితో పంటలు దెబ్బతిన్నాయి. ఇటీవల పంట పొలాల్లో ప్రవహిస్తున్న నీటిని మళ్లించేందుకు సంబంధిత అధికారులు సర్వే కూడా చేపట్టారు. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నీటిని మళ్లించేందుకు రూ.1.35 కోట్లు నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. గత నెల లో రాష్ట్ర విప్ గంగుల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, రైతులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు సహకరిస్తే నీరు మళ్లింపునకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఎలాంటి నీటి మళ్లింపు చర్యలు చేపట్టలేదు.