ఉమ్మడి పౌరస్మృతి కాదు, ఉపాధి అవకాశాలు సృష్టించండి: ఒవైసీ

ABN , First Publish Date - 2022-05-01T21:01:37+05:30 IST

బీజేపీ నేతలు తరచు మాట్లాడుతున్న ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఇప్పుడు..

ఉమ్మడి పౌరస్మృతి కాదు, ఉపాధి అవకాశాలు సృష్టించండి: ఒవైసీ

ఔరంగాబాద్: బీజేపీ నేతలు తరచు మాట్లాడుతున్న ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదని, ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై ముందు దృష్టి సారించాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏఐఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఒవైసీ  మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇప్పటికిప్పుడు దేశానికి యూసీసీ అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు.


దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, బొగ్గు రవాణా కోసం (విద్యుత్ సంక్షోభం దృష్ట్యా) దేశంలోని ప్యాసింజర్ రైళ్లు రద్దవుతున్నాయని అన్నారు. నిరుద్యోగిత పెరిగిపోతోందని, దానిపై దృష్టి సారించడం మంచిదని ఒవైసీ హితవు పలికారు. ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని లా కమిషన్ కూడా చెప్పిందన్నారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ధాకరే ఆదివారం తలపెట్టిన ర్యాలీపై మాట్లాడుతూ, ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

Updated Date - 2022-05-01T21:01:37+05:30 IST