తెలిసీ, తెలియని ఊహాగానాలొద్దు : వాయు సేన

ABN , First Publish Date - 2021-12-10T22:45:43+05:30 IST

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం

తెలిసీ, తెలియని ఊహాగానాలొద్దు : వాయు సేన

న్యూఢిల్లీ : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం లేని ఊహాగానాలు చేయవద్దని భారతీయ వాయు సేన (ఐఏఎఫ్) కోరింది. విచారణ వేగంగానే పూర్తవుతుందని, వాస్తవాలు బయటికి వస్తాయని శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. డిసెంబరు 8న జరిగిన ఈ ప్రమాదంపై త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. యథార్థాలు బయటపడే వరకు సమాచారం లేని ఊహాగానాలు చేయవద్దని కోరింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవ, మర్యాదలను కాపాడాలని కోరింది.


చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ ప్రమాదంలో దివంగతులు కావడంతో ఇది విద్రోహ చర్య అయి ఉంటుందనే అనుమానాలను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ గురువారం చెప్పారు. చైనా, పాకిస్థాన్‌లకు దీటుగా బదులివ్వడంలో జనరల్ రావత్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 


ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటుకు తెలిపారు. మార్షల్ మానవేంద్ర సింగ్ (భారత వాయు సేన (ఐఏఎఫ్) ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్) నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. 


Updated Date - 2021-12-10T22:45:43+05:30 IST