
న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోస్ (Covid Booster Dose) కాలపరిమితి 3 నెలలు తగ్గిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. 18-59 ఏళ్లవారు రెండో డోస్ (Second Dose) తీసుకున్న 6 నెలలకు బూస్టర్ డోస్ (Covid-19 Vaccine Booster Shots) తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గతంలో 2 డోసులు పూర్తయిన 9 నెలల తరువాత మాత్రమే బూస్టర్ డోస్ తీసుకోవాలనే నిబంధన ఉండేది. NTAGI స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ ఈ మేరకు లేఖ రాశారు. వ్యాక్సినేషన్ సెంటర్లు, గృహస్థాయిలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రాష్ట్రాలు సిద్ధం కావాలని ఆ లేఖలో సూచించారు. భారత్లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో బూస్టర్ డోస్ త్వరగా ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారత్లో గడచిన 24 గంటల్లో 16,159 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,212గా ఉన్నాయి. ఇప్పటివరకూ 198 కోట్ల డోసులను ప్రజలకు ఇవ్వడం జరిగిందని Co-WIN Dashboardలో కేంద్రం పేర్కొంది.